ఇద్దరకీ భార్యే: నడిరోడ్డుపై ఆమె కోసం బాహాబాహి.. బీహార్లో వింత ఘటన
ఆమె తన మొదటి భర్తను వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో ఈ వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది.
పాట్నా: ఓ వివాహిత మహిళను నా భార్య అంటే నా భార్య అని ఇద్దరు పురుషులు బాహాబాహికి దిగిన సంఘటన బీహార్ లోని పాట్నాలో చోటు చేసుకుంది. నాతో రమ్మంటే.. నాతో రమ్మని నడిరోడ్డుపై ఇద్దరూ ఆమెను బలవంతం చేయడంతో మధ్యలో పోలీసులు ఎంటరయ్యారు.
ఆ ఇద్దరితో పాటు మహిళను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి విచారించగా.. అసలు నిజాలు వెలుగుచూశాయి. నిజానికి ఆ మహిళ ఇద్దరికీ భార్యేనని తేలింది. విడాకులు ఇవ్వకుండానే మరొకరిని వివాహం చేసుకోవడం.. అనుకోకుండా మొదటి భర్తకు ఎదురుపడటంతో.. ఈ గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది.
పోలీసుల కథనం ప్రకారం.. బీహార్ లోని గొరౌలీ నివాసి ప్రసాద్ రామ్ కుమార్తె కంచన్ కుమార్తె గతంలో ఒకతన్ని ప్రేమించింది. అయితే ఆమె ఇష్టాలతో పనిలేకుండా తండ్రి మాత్రం ధర్మేంద్ర అనే వేరే వ్యక్తితో వివాహం జరిపించాడు. 2013లో వీరికి వివాహం జరగ్గా.. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
ఇదే క్రమంలో కంచన్ కుమారి ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రియుడు అనిల్ ను పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి మొదటి భర్తకు దూరంగానే ఉంది. అయితే ఇటీవల అనుకోని పరిస్థితుల్లో మొదటి భర్త ధర్మేంద్రకు ఆమె ఎదురుపడింది. దీంతో అతను ఆమెను తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఆమె భర్త అడ్డుపడటంతో.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆపై విషయం పోలీస్ స్టేషన్కు చేరడంతో.. వీరి సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు తలలు పట్టుకున్నారు.