దీపావళి నాటికి భారత్-యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం : కేంద్రమంత్రి పీయూష్ గోయల్
భారత్-యూకే మధ్య సంబంధాల్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఇరు దే్శాల మధ్య ఉన్న సంబంధాలను దృష్టిలో ఉంచుకుని బ్రిటన్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఈ ఏడాది దీపావళి నాటికి ఈ ఒప్పందం కుదిరే అవకాశం ఉందని కేంద్రం చెబుతోంది.
సానుకూల సందేశంతో లండన్లో జరిగిన ప్రత్యేక కర్టెన్ రైజర్ కార్యక్రమంలో యూకే ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇండియా గ్లోబల్ ఫోరమ్ (IGF) నిర్వహించిన UK-ఇండియా వీక్ 2022ను భారత వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు. విన్-విన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) రెండు దేశాల కోసం పని చేస్తోంది. ఇందులో భాగంగా భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై పీయూష్ గోయల్ స్పందించారు.
ఈ ఏడాది దీపావళి నాటికి భారత్-బ్రిటన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదురుతుందని పీయూష్ గోయల్ వెల్లడించారు. మే 26 సాయంత్రం తాజ్ 51 బకింగ్హామ్ గేట్లో IGF వ్యవస్థాపక ప్రొఫెసర్ మనోజ్ లాడ్వాతో జరిగిన చర్చల్లో పీయూష్ గోయల్ దావోస్లోని ప్రపంచ ఆర్థిక వేదిక (WEF)లో ఇటీవలి సంప్రదింపుల నుండి అనేక విషయాలపై వివరాలను పంచుకున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎఫ్టిఎ-స్నేహపూర్వకంగా అమలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించారు.
భవిష్యత్తుకు సంబంధించి భారత్ లో యువత చూసే విధానానికీ, మిగతా ప్రపంచం చూసే దానికీ ఎంతో వ్యత్యాసం ఉందని పీయూష్ గోయల్ తెలిపారు. దావోస్ లో సైతం అంత సానుకూల వాతావరణం కనిపించలేదన్నారు. భారత్ ఇతర ప్రపంచదేశాలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉందని కేంద్రమంత్రి వెల్లడించారు. ఇందుకు తగిన అవకాశాలు కల్పించేందుకు ఎదురుచూస్తున్నామన్నారు.