ఒక్కటైన పెళ్లి కాని ప్రసాదులు.. ప్రభుత్వంపై వినూత్న నిరసన.. ఎందుకంటే!!
పెళ్లి వయసు వచ్చినా, పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా పెళ్లి కాకపోతే ఆ బాధ వర్ణనాతీతం. అటువంటి బాధనే అనుభవిస్తున్నారు మహారాష్ట్రలోని సోలాపూర్ యువకులు. చక్కగా చదువుకొని, మంచి ఉద్యోగంలో స్థిరపడినా కూడా పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయిలు దొరక్కపోవడంతో వినూత్నంగా నిరసన తెలిపారు. తమకు పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు దొరక్కపోవడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆందోళన నిర్వహించారు. ఇక ఈ విషయం వినటానికి వింతగా అనిపించినా వారు చేసిన ఆందోళనలో అర్ధం లేకపోలేదు.
ఒక్కటైన పెళ్లి కాని ప్రసాదులు.. గుర్రాలపై వెళ్లి ఆందోళన
మహారాష్ట్ర రాష్ట్రంలోని సోలాపూర్ లో పెళ్లి కాని ప్రసాదులు అందరూ ఒకటయ్యారు. ఎంత ప్రయత్నం చేసినా పెళ్లి చేసుకోవటానికి యువతులు దొరకటం లేదని గుర్తించి వారంతా సంఘటితంగా పోరుబాట పట్టారు. తమ పెళ్లి కాకపోవడానికి ప్రభుత్వమే కారణమని ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. తాము పెళ్లి చేసుకోవడానికి రాష్ట్రంలో తగిన సంఖ్యలో అమ్మాయిలు లేరని ఆవేదన వ్యక్తం చేస్తూ పెళ్లి కానీ ప్రసాదులు అందరూ గుర్రాలపై వెళ్లి కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు.
తమకు పెళ్లి కాకపోవటానికి కారణం ప్రభుత్వమే అంటూ ఆందోళన
క్రాంతి జ్యోతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో యువకులు పెళ్లి కొడుకుల మాదిరిగా అలంకరించుకొని పెద్ద సంఖ్యలో గుర్రాలపై కలెక్టరేట్ వద్దకు వెళ్లారు. ఆపై కలెక్టరేట్ ముందు బైఠాయించి తమకు పెళ్లి కాకపోవడానికి, తగిన సంఖ్యలో అమ్మాయిలు లేకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అన్నారు. రాష్ట్రంలో లింగ నిర్ధారణ చట్టం కట్టుదిట్టంగా అమలు కావడం లేదని, దానివల్లే లింగనిష్పత్తి దారుణంగా పడిపోతుందని, అమ్మాయిల సంఖ్య ఎక్కువగా లేకపోవడానికి అదే కారణమంటూ వారు ఆందోళన చేశారు.
భవిష్యత్ తరాలకు ఈ బాధ వద్దు మహాప్రభో అంటూ విజ్ఞప్తి
ఉన్నత చదువులు చదువుకుని మంచి స్థానాల్లో సెటిల్ ఐనప్పటికీ తమకు పెళ్లిళ్లు కావడం లేదు మహాప్రభో అంటూ యువకులు కలెక్టరేట్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పురుషులకు సరి కూడా మహిళలు లేకపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం అన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో లింగనిర్ధారణ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, తాము పడుతున్న బాధ భవిష్యత్ తరాలు పడకూడదని వారు వినూత్నంగా తమ నిరసనను తెలియజేశారు.