యూత్ వ్యాక్సినేషన్లో వివక్ష- 85 శాతం మంది ఆ ఏడు రాష్ట్రాల్లోనే-సర్వత్రా చర్చ
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేగుతున్నా వ్యాక్సిన్ల కొరత అంతకు మించి ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం తయారవుతున్న వ్యాక్సిన్ల వేగాన్ని లెక్కలోకి తీసుకుంటే దేశ జనాభా మొత్తానికి వ్యాక్సిన్ వేసేందుకు మూడు, నాలుగేళ్లు పడుతుందన్నవార్తలు ఆందోళన రేపుతున్నాయి. దీంతో ప్రస్తుతం బయటికొస్తున్న వ్యాక్సిన్లు ఎవరికివ్వాలనే విషయంలో లెక్కలు మారిపోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ నెలలో ఇప్పటివరకూ జరిగిన వ్యాక్సినేషన్ గమనిస్తే వ్యాక్సిన్ వివక్ష ఎలా ఉందో అర్ధమవుతోంది.
వ్యాక్సినేషన్పై మరో దుమారం
భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను ముందుకు నడిపించడంలో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతోంది. అందుబాటులో వ్యాక్సిన్లు లేకుండానే మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు సరిపడా వ్యాక్సిన్లు లేకపోవడంతో అభాసుపాలవుతోంది. దీంతో కొన్ని రాష్ట్రాల్లో ఎంపిక చేసిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్ కొనసాగించడం ద్వారా కొత్త వివాదానికి ఆజ్యం పోస్తోంది. ప్రస్తుతం వ్యాక్సినేషన్లో బయటపడుతున్న అసమానత్వం విమర్శలకు తావిస్తోంది.
యూత్ వ్యాక్సినేషన్లో వివక్ష
ప్రస్తుతం కేంద్రం ప్రకటించిన విధంగా దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్లో భాగంగా 18 నుంచి 44 ఏళ్లు మధ్య వయస్సు వారికి వ్యాక్సిన్లు ఇవ్వాల్సి ఉంది. కానీ వ్యాక్సిన్ల కొరత కారణంగా ఈ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో వ్యాక్సినేషన్ ను ఎంచుకున్న వారికి ఇవ్వడం ద్వారా కేంద్రం, బీజేపీ పాలిత రాష్ట్రాలు వివక్ష చూపుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ సాగాల్సిఉండగా.. కొన్నిరాష్ట్రాల్లోనే ఇది చేపట్టడంపై ముఖ్యంగా విమర్శలు వినిపిస్తున్నాయి.
85 శాతం మంది ఆ ఏడు రాష్ట్రాల వారే
ఈ నెల 1 నుంచి 12వ తేదీ వరకూ వ్యాక్సిన్ ఇచ్చిన 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిని గమనిస్తే భారత్లో వ్యాక్సిన్ వివక్ష ఎలా ఉందో అర్ధమవుతుంది. ఈ 12 రోజుల్లో వ్యాక్సిన్ ఇచ్చిన వారిలో 85 శాతం మంది కేవలం 7 రాష్ట్రాల్లో వారే కావడం చర్చనీయాంశమవుతోంది. ఈ ఏడు రాష్టాల్లో మహారాష్ట్ర, రాజస్దాన్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నాయి. ఆయా రాష్ట్రాలు ఓపెన్ మార్కెట్ నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసి తమ రాష్ట్రాల్లో 18 నుంచి 44 ఏళ్ల వారికి ఇచ్చాయి.
Recommended Video
ఎక్కువ కేసులున్నచోట తక్కువ వ్యాక్సినేషన్
కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు వ్యాక్సినేషన్లో ప్రాధాన్యం ఇవ్వాల్సిన కేంద్రం.. వాటిని పట్టించుకోకుండా కొన్ని రాష్టాలపైనే ప్రేమ చూపుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రోజుకు లక్షకు పైగా కేసులు నమోదవుతున్న మిగతా రాష్ట్రాల్లో్ ఇప్పటివరకూ కేవలం 5.86 శాతం వ్యాక్సినేషన్ జరగడం విశేషం. ఇందులో అత్యధిక కేసులున్నకర్నాటకలో ఇప్పటివరకూ 74వేల డోసులు మాత్రమే ఇచ్చారు. దేశంలో మూడో అత్యధిక కేసు లోడ్ ఉన్న కేరళలో 771 డోసులు, ఏపీలో 1133 డోసులు, తమిళనాడులో 22 వేల డోసులు, బెంగాల్లో 12 వేల డోసులు మాత్రమే ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే ఎక్కువ కేసులున్న చోట వ్యాక్సిన్ వివక్ష ఎలా ఉందో అర్ధమవుతోంది.