రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేత కుదరదన్న వెంకయ్య-రేపటి నుంచి పార్లమెంటు బయట ధర్నా
దురుసు ప్రవర్తన కారణంగా సస్పెండ్ చేసిన 12 మంది రాజ్యసభ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేసేందుకు రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు నిరాకరించారు. నిన్న తీసుకున్న నిర్ణయం తనది మాత్రమే కాదని, సభ తీసుకున్న నిర్ణయమని వెంకయ్య తెలిపారు. ఆగస్టు 10వ తేదీ సభ రికార్డుల్ని పరిశీలిస్తే ఆ రోజు ఏం జరిగిందో తెలుస్తుందన్నారు. విపక్షసభ్యులు సభలో గందరగోళం చేసినందుకే వారిని సస్పెండే చేశామని, కానీ వారు తమ చర్యలపై పశ్చాతాపం కూడా వ్యక్తం చేయడం లేదని వెంకయ్య తెలిపారు.అందుకే వారి అప్పీల్ను పరిగణనలోకి తీసుకోవడానికి తాను నిరాకరిస్తున్నానని, ఎంపీల ప్రవర్తనపై దేశం ఆవేదన చెందిందని వెంక్యయ వెల్లడించారు.
మరోవైపు 12 మంది రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని సభలో డిమాండ్ చేసి అనంతరం వాకౌట్ చేసిన 15 విపక్ష పార్టీలు అనంతరం రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యను కలిశారు. అయితే వారితోనూ వెంకయ్య అంతే పట్టుదలగా మాట్లాడారు. సస్పెన్షన్ పై వునరాలోచన లేదన్నారు. అయితే సభ్యులు వారి ప్రవర్తన పై క్షమాపణ చెప్పి ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరిస్తే మాత్రం పునరాలోచిస్తానన్నారు.
వెంకయ్య సమాధానంతో విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సస్పెండైన సభ్యులు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు. వారు సభా నియమాలకు వ్యతిరేకంగా ప్రవరించలేదని విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే తెలిపారు. దీంతో సస్పెన్షన్ పై కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకే విపక్షాలు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం విపక్ష పార్టీలు మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఖర్గే తెలిపారు. మరోవైపు సస్పెండైన 12 మంది ఎంపీలు రేపటి నుంచి పార్లమెంట్ బయట ధర్నా చేపడతామని ప్రకటించారు. ఈ సమావేశాల ముగింపు వరకూ ఈ ధర్నా కొనసాగిస్తామని తెలిపారు.
మరోవైపు విపక్షాలు చేపడుతున్న నిరసనలకు మరో విపక్షం తృణమూల్ కాంగ్రెస్ దూరంగా ఉంటోంది. ఈ నిరసనలపై తమదైన ముద్ర ఉండాలని కోరుకుంటోంది. ఎంపీల సస్పెన్షన్ కు తాము వ్యతిరేకమని చెబుతూనే నిరసనలపై తమదైన కార్యాచరణ ఉందని తృణమూల్ ఎంపీ నదీముల్ హక్ తెలిపారు. విపక్షాలను కాంగ్రెస్ ముందుండి నడిపిస్తుండటంతో అందులో కలిస్తే తమకు మైలేజ్ రాదని భావిస్తున్న టీఎంసీ.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.