‘దమ్ముంటే సౌదీలో పందిమాంసం అడిగి తిరిగిరండి’
లక్నో: విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) అధికార ప్రతినిధి సురేంద్ర జైన్ గోవధ నిషేధంను వ్యతిరేకిస్తున్న వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత్లో గోవధ నిషేధం, ఆవు మాంసం వినియోగంపై వివాదాలు సృష్టిస్తూ ప్రభుత్వానికి అవార్డులు తిరిగిచ్చేస్తున్న రచయితలకు ఆయన సవాల్ విసిరారు.
వీరికి దమ్ముంటే సౌదీ అరేబియా వెళ్ళి.. పంది మాంసం అడిగి.. భారత్కు తిరిగిరావాలని సవాల్ చేశారు. అలా ప్రాణాలతో తిరిగి వచ్చినవారికి తాము ఘన స్వాగతం చెబుతామన్నారు. లక్నో వచ్చిన సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘అక్కడ ఆ పని చెయ్యలేనివారు.. ఇక్కడ కపటత్వాన్ని ప్రదర్శించడం సరికాదు' అని అన్నారు.
మన దేశంలో అత్యధికులు మంసాహారులేనన్న సంగతి తమకు, సంఘ్ పరివార్కు తెలుసన్నారు. కేవలం గోవధను, అవు మాంసాన్ని వినియోగించడాన్ని మాత్రమే నిషేధించాలంటున్నామని సురేంద్ర స్పష్టం చేశారు. గోమాత హైందవ విశ్వాసాలకు కేంద్ర బిందువన్న ఆయన.. ఇతరుల మత విశ్వాసాలను హిందువులు ఎప్పుడూ గౌరవిస్తూ వచ్చారన్నారు.
భారత్లోని ముస్లింల పరిస్థితిపై ఐక్యరాజ్య సమితికి లేఖ రాసిన యూపీ మంత్రి ఆజంఖాన్పై దేశద్రోహం కింద కేసు పెట్టాలని, వెంటనే మంత్రివర్గం నుంచి ముఖ్యమంత్రి అఖిలేష్ తొలగించాలని సురేంద్ర డిమాండ్ చేశారు. అప్పుడే సమాజ్వాదీ ప్రభుత్వం పట్ల హిందువులకు విశ్వాసం ఉంటుందని పేర్కొన్నారు.
ఇక సిఎం కూడా ఒక సామాజిక వర్గానికి మాత్రమే అండగా ఉంటూ రూ.45 లక్షలు పరిహారం, ఉద్యోగాలు ఇస్తున్నారని, ఇతర సామాజిక వర్గాల్లోని బాధితులను పట్టించుకోవడం లేదని సురేంద్ర ఆరోపించారు. దేశంలో హిందువులపై ప్రత్యక్ష సవాళ్ళు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.