ప్రధాని అభ్యర్ధి ఎవరో తేల్చేసిన విజయ్..! కాంగ్రెస్ క్లారిటీ..!
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం తర్వాత మారిన పరిస్ధితుల్లో దేశవ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానిగా ఎవరిని ఎంచుకుంటారంటూ ఇండియా టుడే-సీఓటర్ కలిసి నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో అడిగిన ప్రశ్నకు మోడీ, రాహుల్ గాంధీ తర్వాత విజయ్ (Vijay)కు జనం మద్దతిచ్చారు. దీంతో తమిళనాడులో తాజాగా జట్టు కట్టి ప్రభుత్వంలో భాగస్వాములైన టీవీకే-కాంగ్రెస్ మధ్య చిచ్చు రేగింది. ఈ వివాదం ఎక్కడికో వెళ్తున్న నేపథ్యంలో విజయ్ ప్రధాని అభ్యర్థిత్వంపై క్లారిటీ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తమిళనాడు సీఎల్పీ నేత తారాహై కత్ బెర్ట్ (Tarahai Cuthbert) వెల్లడించారు.
సీఎం విజయ్.. ఇప్పటికే ఇండియా కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీని ఎంచుకున్నారని తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ తెలిపారు. అలాగే కాంగ్రెస్, టీవీకే మధ్య విభేదాలున్నాయన్న ఊహాగానాలను కూడా ఆమె తోసిపుచ్చారు. విజయ్ ప్రధానమంత్రి అవుతారన్న ప్రచారం కొన్ని వర్గాల్లో టీవీకే కార్యకర్తల ఉత్సాహం వల్లే జరుగుతోందని, అది పార్టీ నాయకత్వం అధికారిక వైఖరిని ప్రతిబింబించదని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి విజయ్ రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ఎంచుకున్నారని, ఆయన ఆ దిశగానే ముందుకు వెళ్తున్నారని కత్ బర్ట్ తేల్చిచెప్పారు.

దీంతో ప్రధాని అభ్యర్దిత్వంపై రాహుల్ గాంధీ-విజయ్ మధ్య పోటీ నెలకొందన్న చర్చకు తాత్కాలికంగా తెరపడినట్లయింది. అయితే ఈ విషయాన్ని సీఎల్పీ నేత అయిన తారాహై కత్ బర్ట్ చెప్పినా, టీవీకే వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ విషయంలో ప్రస్తుతానికి టీవీకే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయ్ ను జాతీయ నేతగా ఫోకస్ చేసుకుంటున్న టీవీకే.. ఆ మేరకు సోషల్ మీడియా ప్రచారాల్ని కూడా భారీగా నిర్వహిస్తోంది. వీటి ప్రభావమే ఇండియా టుడే సర్వేపై కనిపించిందన్న చర్చ నడుస్తోంది.














Click it and Unblock the Notifications