విజయ్ ఆఫర్ కు నో చెప్పేసిన ఉదయనిధి..! షాకింగ్ రీజన్..!
తమిళనాడు(tamil nadu) రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఓ పక్క ప్రతీ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని, ప్రోటోకాల్ మర్యాదలు పాటించడం లేదని గగ్గోలు పెట్టే ప్రతిపక్షాలు కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడులో మాత్రం అక్కడి ప్రభుత్వం ఇచ్చిన ఓ ఆఫర్ ను తీసుకునేందుకు ప్రతిపక్ష డీఎంకే నో చెప్పేసింది. దానికీ ఓ కారణాన్ని వెతుక్కుంది. దీంతో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో విజయ్ (Vijay) సర్కార్ తాజాగా అసెంబ్లీలో ఓ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకూ ఉచితంగా కార్లు (Free Car) ఇస్తామని ప్రకటించింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో చురుగ్గా తిరిగేందుకు ఇలా కార్లు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ప్రజా ప్రతినిధులుగా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడానికి వారికి కారు అవసరమని ప్రభుత్వం తెలిపింది. తగిన వనరులు లేదా రవాణా సదుపాయాలు లేకుండా ఎమ్మెల్యేలు సమర్థవంతంగా పనిచేయలేరని, కాబట్టి వారికి వాహనాలు సమకూర్చాలని అధికార కూటమిలోని వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి కోరిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. ఉచిత కార్లతో పాటు డ్రైవర్, పెట్రోల్, వాహన నిర్వహణ ఖర్చుల కోసం ఎమ్మెల్యేలకు నెలకు 75వేలు భత్యాన్ని కూడా ఇచ్చేందుకు అంగీకరించింది.

అయితే ఈ ఆఫర్ ను మిగతా పార్టీలన్నీ స్వాగతించగా.. విపక్ష డీఎంకే మాత్రం తోసిపుచ్చింది. రాష్ట్రంపై పెరుగుతున్న అప్పుల భారాన్ని కారణంగా చూపుతూ ఈ ఆఫర్ ను విపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ (Udyanidhi Stalin) తిరస్కరించారు. ఈ ఆఫర్ను స్వీకరించకూడదని తమ పార్టీకి చెందిన మొత్తం 59 మంది ఎమ్మెల్యేలు నిర్ణయించుకున్నట్లు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ప్రకటించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక సంక్షోభం గురించి పదేపదే ప్రస్తావిస్తున్న విషయాన్ని గుర్తుచేస్తూ, టీవీకే ప్రభుత్వ ద్వంద్వ విధానాల్ని ఆయన ప్రశ్నించారు. అయితే కార్లు లేని ఎమ్మెల్యేలకు మాత్రం ఇవ్వాలని సూచించారు. ఉచిత పథకాలకు వ్యతిరేకమని, ప్రభుత్వం అప్పుల్లో ఉందని టీవీకే చెప్తోంది కాబట్టి, ప్రభుత్వ అప్పుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ ఆఫర్ను తీసుకోకూడదని తాము నిర్ణయించుకున్నట్లు ఉదయనిధి వెల్లడించారు.














Click it and Unblock the Notifications