బెంగాల్ హింసాత్మక ప్రాంతాల్లో గవర్నర్ టూర్-మోడీ, షా స్క్రిప్ట్ ప్రకారమేనన్న టీఎంసీ
పశ్చిమబెంగాల్లో వరుసగా మూడోసారి కొలువుదీరిన మమతా బెనర్జీ ప్రభుత్వానికీ, గవర్నర్కూ మధ్య మరోసారి వివాదాలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల అనంతరం హింస చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించాలన్న గవర్నర్ నిర్ణయం ఈ వివాదానికి కారణమవుతోంది. గవర్నర్ తీరుపై అధికార తృణమూల్ కాంగ్రెస్ మండిపడుతోంది.
పశ్చిమబెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం పలుచోట్ల హింసచెలరేగింది. ఇందులో దాదాపు 15 మంది చనిపోయారు. వీరంతా బీజేపీ కార్యకర్తలే కావడంతో కేంద్రం సూచనల మేరకు గవర్నర్ జగ్దీప్ ధన్కర్ ఆయా చోట్ల పర్యటించాలని నిర్ణయించారు. నిన్న ప్రభుత్వం వద్దంటున్నా హింస చెలరేగిన ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు. తన సొంత కాన్వాయ్తోనే మతభంగ, దిన్హాటా ప్రాంతాల్లో గవర్నర్ పర్యటించారు. అదే సమయంలో స్ధానికులు గవర్నర్ గో బ్యాక్ నినాదాలు కూడా చేశారు. దీంతో తన వాహనం నుంచి దిగి గవర్నర్ ఇక్కడ రూల్ ఆఫ్ లా నిర్వీర్యం అయిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. ఆ తర్వాత ట్వీట్లలోనూ తన పర్యటనలో జనంలో భయం చూశానన్నారు.

గవర్నర్ పర్యటనపై అధికార తృణమూల్ కాంగ్రెస్ మండిపడింది. ఇదంతా మోడీ, షాల స్క్రిప్టులో భాగమేనని పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా ఆరోపించారు. రాజ్యాంగంపై గౌరవం లేని మోడీ, షా బెంగాల్లో ఓటమిని అంగీకరించలేకే ఇలాంటి చర్యల్ని ప్రేరేపిస్తున్నారని సిన్హా విమర్శించారు. వారు మమతను శాంతియుతంగా ఉండనివ్వబోరన్నారు. గవర్నర్ ధన్కర్ రీకాల్ కోసం ఇప్పటికే తాము రాష్ట్రపతిని ఆశ్రయించామని, అధినేత్రి మమత కోరితే మరోసారి రాష్ట్రపతిని కలుస్తామని టీఎంసీ ఎంపీ సౌగత్రాయ్ తెలిపారు.












Click it and Unblock the Notifications