మా రాజుకు ప్రమాదం తప్పింది: ఫడ్నవీస్ కోసం ప్రాణాలకు తెగించిన ఇర్ఫాన్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు గురువారం ఘోరప్రమాదంనుంచి త్రుటిలో తప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఒక్కసారిగా కుప్పకూలిన హెలికాప్టర్ పేలే ప్రమాదం ఉందని తెలిసినా..
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్కు గురువారం ఘోరప్రమాదంనుంచి త్రుటిలో తప్పించుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఒక్కసారిగా కుప్పకూలిన హెలికాప్టర్ పేలే ప్రమాదం ఉందని తెలిసినా.. స్థానిక స్క్రాప్ వ్యాపారి ఇర్ఫాన్ షేక్ తన ప్రాణాలకు తెగించి తమ ముఖ్యమంత్రి ప్రాణాలు కాపాడాడు. అంతేగాక, మా రాజు పెద్ద ప్రమాదం తప్పింది.. అంతకన్నా ఇంకేం కావాలి అంటూ తన మంచి తనాన్ని చాటుకున్నాడు ఇర్ఫాన్.
వివరాల్లోకి వెళితే.. గురువారం సీఎం ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పైలట్ తిరిగి కిందికి దించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. లాతూర్ సమీపంలోని నీలంగ ప్రాంతంలో కిందికి దిగే సమయంలో హెలికాప్టర్ పైనున్న తీగల్లో చిక్కుకుపోయి కూలిపోయింది.
లాతూర్ సమీపంలో తమ హెలికాప్టర్ ప్రమాదానికి గురయిందని, అయితే, ప్రమాదం అనంతరం తామంతా క్షేమంగా ఉన్నామని, ఆందోళన చెందాల్సింది ఏమీ లేదని ఫడ్నవీస్ స్వయంగా ఒక ట్వీట్లో తెలియజేశారు. హెలికాప్టర్లో ముఖ్యమంత్రి, హెలికాప్టర్ సిబ్బంది ఇద్దరు సహా ఆరుగురు ఉన్నారు.
కాగా, ఈ ప్రమాదంలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సికోర్స్కీ హెలికాప్టర్ బాగా దెబ్బతిన్నదని పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డిజిసిఏ)కు చెందిన ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. లాండింగ్ అయ్యే సమయంలో హెలికాప్టర్ తీగల్లో చిక్కుకుపోయిందని ఆ అధికారి చెప్తూ.. హెలికాప్టర్లోని మొత్తం ఆరుగురు ఎలాంటి తీవ్ర గాయాలు లేకుండా క్షేమంగా బైటపడ్డారని తెలిపారు.
ప్రమాద స్థలికి మొట్టమొదట వెళ్ళింది ఇర్ఫానే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హెలికాప్టర్ ప్రమాదం జరిగాక.. మొట్టమొదటగా ఘటనా స్థలికి చేరుకున్న వ్యక్తి ఇర్ఫాన్ షేక్. హెలికాప్టర్ కూలగానే అమాంతంగా పరుగులుపెట్టాడు. హెలికాప్టర్లో ఉన్న ముఖ్యమంత్రి బయటకు రావటానికి సహాయపడ్డాడు.
కుప్పకూలిన హెలికాప్టర్
మహారాష్ట్రలోని నిలంగా అనే గ్రామంలో ఇర్ఫాన్ స్క్రాప్ వ్యాపారం చేసుకుంటున్నాడు. అతని దుకాణం సమీపంలోనే సీఎం దిగటానికి హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలికాఫ్టర్ నిలంగా నుంచి లాతూర్ వెళ్లటానికి టేకాఫ్ అయింది. అంతలో పైకి ఎగిరిన భారీ విహంగం నేల వైపు దూసుకొచ్చింది. దుమ్ముతో ఆ ప్రాంతమంతా నిండిపోయింది. హైటెన్షన్ వైరుకు తగిలిన వెంటనే పెద్దశబ్ధంతో హెలికాప్టర్ కుప్పకూలింది.
తన ప్రాణాలను లెక్క చేయలేదు
ఈ ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న జనం, అధికారులు దూరంగా పరుగులు దీశారు. కానీ, ఇర్ఫాన్ మాత్రం తన ప్రాణాలను లెక్క చేయకుండా హెలికాప్టర్ వైపు పరుగెత్తాడు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఇరుక్కున్న డోర్ లాక్ను ఓపెన్ చేశాడు. ఆయన సురిక్షితంగా బయటకు తీసేలా సహకరించాడు.
మా రాజు బతికాడు..
ఆ తర్వాత మిగతా వారిని కూడా బయటకు తీశాడు. హెలికాప్టర్ పడగానే ఇటువైపు ఎందుకు పరుగులు తీశావని మీడియా అడిగితే... 'మా రాజు లోన ఇరుక్కున్నారు' అని బదులిచ్చాడు. సీఎంను కలవాలని అనుకుటున్నావా? అని అడిగితే.. 'లేదు. మా రాజుకు ప్రమాదం తప్పింది. అది చాలు' అని ఇర్ఫాన్ పేర్కొనడం అతని మంచి తనానికి నిదర్శనం. కాగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ధృవీకరించింది. తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా.. సీఎం ప్రాణాలు కాపాడిన ఇర్ఫాన్కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
అందరూ బయటికి వచ్చాకే..
‘నేను బాగానే ఉన్నాను.. పైలట్ వైపు ఏమైనా సాయం అవసరమో చూద్దాం' అంటూ సీఎం దిగగానే చెప్పారని ఇర్ఫాన్ తెలిపాడు. తను పైలట్ వైపు డోర్ కూడా తీసి, అందరూ బయటికి వచ్చాక అక్కడ్నుంచి కదిలాడు ఇర్ఫాన్. ఆ తర్వాత పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది హెలికాప్టర్ వద్దకు చేరుకున్నారు. కాగా, సీఎం ఓ అంబులెన్స్లో సమీపంలోని ఓ మంత్రి ఇంటికి వెళ్లి, అక్కడ్నుంచి ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లారు.
11కోట్ల ప్రజల ఆశీస్సులతో..
రైతులకు చేరువ కావడానికి భారతీయ జనతా పార్టీ రాష్టవ్య్రాప్తంగా నిర్వహిస్తున్న ‘శివర్ సంవాద్ సభ' కార్యక్రమంలో పాల్గొనడానికి ఫడ్నవిస్ లాతూర్ వెళ్లారు. హెలికాప్టర్ ప్రమాదం తర్వాత ఫడ్నవిస్ మీడియాతో మాట్లాడుతూ.. తాను క్షేమంగానే ఉన్నానని, హెలికాప్టర్కు చిన్న ప్రమాదం జరిగిందని, జనం పుకార్లను నమ్మరాదని అన్నారు. పైలట్ సహా ఎవరూ గాయపడలేదని, తన మీడియా సలహాదారు కేతన్ పాఠక్ మాత్రం స్వల్పంగా గాయపడ్డారని చెప్పారు. 11 కోట్ల మహారాష్ట్ర ప్రజల ఆశీస్సులతో తాను క్షేమంగా ఉన్నానని చెప్పారు. కాగా, ఈ ప్రమాదంపై పౌర విమానయాన శాఖ పరిధిలోని ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఐబి) దర్యాప్తు జరుపుతుంది. ఇటీవల విదర్భ ప్రాంతంలోని గడ్చిరోలిలో పర్యటించినప్పుడు సైతం ఫడ్నవిస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్కు సాంకేతిక ఇబ్బంది రావడంతో ఆయన నాగపూర్కు రోడ్డుమార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది.