కొలువుదీరిన సర్కార్: ఉద్దవ్ సేన ఇదే, ఆరుగురు మంత్రులు వీరే...
మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. శివాజీ పార్క్ వద్ద సీఎంగా ఉద్దవ్ థాకరేతో ప్రమాణ స్వీకార ఘట్ట ఆరంభమైంది. ఏక్నాథ్ షిండేతో మంత్రుల ప్రమాణం స్వీకారం ప్రారంభమైంది. శివాజీ పార్క్ వద్ద జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి అధినేతలు సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఆశీనులయ్యారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, సుప్రియ సూలే, అజిత్ పవార్, పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు హాజరయ్యారు.
ఉద్దవ్ నమ్మిన బంటు..
ఏక్నాథ్ షిండే 1964 ఫిబ్రవరి 9న షిండే జన్మించారు. జవాలి తాలుకాలోని సాతారా షిండే స్వస్థలం. ఇంటర్ మొదటి సంవత్సరం చదివి.. తర్వాత ఆపివేశారు. మంగళ హైస్కూల్ జూనియర్ కాలేజీలో షిండే విద్యాభ్యాసం కొనసాగింది. తర్వాత పనులు చేస్తూనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. బాల్థాకరేపై ఉన్న అభిమానంతో ఆయన శివసేన పార్టీలో చేరారు. 1980 నుంచి పార్టీ కోసం పనిస్తున్నారు. థానే పురపాలకశాఖలో కార్పొరేటర్ నుంచి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కోప్రి నియోజకవర్గం నుంచి షిండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గత ఫడ్నవీస్ ప్రభుత్వంలో ప్రజారోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.
తండ్రి మరణంతో..
1962లో జయంత్ పాటిల్ జన్మించారు. జయంత్ తండ్రి రాజరాంబాపు పాటిల్ కూడా రాజకీయ నేతనే.. అయితే ఆయన 1984లో చనిపోవడంతో జయంత్ పాటిల్ రాజకీయల్లోకి వచ్చారు. అమెరికాలో పై చదువులను మధ్యలోనే ఆపివేసి ఇండియా తిరిగొచ్చారు. ఇస్లాంపూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటినుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.. విజయ పరంపర కొనసాగించారు. 27 ఏళ్ల నుంచి తన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
గతంలో కూడా..
ఇప్పుడే కాదు 1999 నుంచి 2008 వరకు కూడా జయంత్ పాటిల్ మంత్రిగా పనిచేశారు. అంతేకాదు వరుసగా 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి జయంత్ పాటిల్ రికార్డు సృష్టించారు. ఆ సమయంలోనే ఆర్థిక మాంద్యం కూడా ఉన్న సంగతి తెలిసిందే. 2008లో ముంబైలో ఉగ్రదాడుల తర్వాత నైతిక బాధ్యత వహిస్తూ ఆర్ ఆర్ పాటిల్ హోంశాఖ మంత్రి పదవీకి రాజీనామా చేశారు. దీంతో జయంత్ పాటిల్కు హోంమంత్రి పదవీ చేపట్టే అవకాశం లభించింది. తన హయాంలో పోలీసుశాఖలో వినూత్న విధానాలను అవలంభించారు. పోలీసులకు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలను అందజేశారు.
సుభాష్ దేశాయ్ నేపథ్యం..
శివసేన పార్టీకి చెందిన సుభాష్ దేశాయ్ ఉద్దవ్ థాకరే క్యాబినెట్లో మంత్రిగా ప్రమాణం చేశారు. ముంబై కొంకణ్ ప్రాంతానికి చెందిన దేశాయ్.. మరాఠా సామాజిక వర్గానికి చెందినవారు. శివసేన పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో ఫడ్నవీస్ మంత్రివర్గంలో కూడా దేశాయ్ పరిశ్రమల శాఖా మంత్రిగా పనిచేశారు. 1990. 2004. 2009లో దూశాయ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009-2014 మధ్య శివసేన ఎల్పీ నేతగా పనిచేశారు.
ఛగన్ భుజ్బల్ నేపథ్యం
ఉద్దవ్ థాకరే ప్రభుత్వంలో ఎన్సీపీ నుంచి ఛగన్ భుజ్బల్ మంత్రిగా ప్రమాణం చేశారు. భుజ్బల్ ఓబీసీ సామాజిక వర్గానికి చెందినవారు. రాజకీయాలకు రాకముందు కూరగాయాలు విక్రయించేవారు. వారికి చిన్న పండ్ల షాపు కూడా ఉండేది. డిప్లోమా పూర్తిచేశాక.. శివసేన అంటే అభిమానంతో పార్టీలో చేరారు. శివసేన నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన భుజ్బల్.. 1991లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమ నేత శరద్ పవార్ పార్టీని వీడంతో ఎన్సీపీలో చేరారు. శివసేన పార్టీలో ఉన్న సమయంలో రెండుసార్లు ముంబై మేయర్గా పనిచేశారు.
బాలసాహెబ్ తొరట్
ఉద్దవ్ థాకరే క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బాలసాహెబ తొరట్ మంత్రిగా పనిచేశారు. ఉత్తర మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన తోరట్.. మరాఠా సామాజిక వర్గానికి చెందినవారు. 1953లో తొరట్ జన్మించారు.
నితిన్ రౌత్
కాంగ్రెస్ పార్టీ నుంచి నితిన్ రౌత్ ఉద్దవ్ థాకరే క్యాబినెట్లో చేరారు. శివాజీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారం చేశారు. నాగ్పూర్ ఉత్తరం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.