ఏటీఎం: 5 లావాదేవీలపై ఆలోచనలో పడ్డ బ్యాంకులు
న్యూఢిల్లీ: బ్యాంకుల ఏటీఎంల ద్వారా వినియోగదారులు చేసే లావాదేవీల సంఖ్యపై ఆంక్షలు విధించడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) అనుమతించినా వాటిని అమలు చేసే విషయంలో బ్యాంకులు మాత్రం ఆలోచనలో పడ్డాయి.
సొంత కస్టమర్లకు ఉచిత లావాదేవీలపై పరిమితి విధించడంతో బ్యాంకు బ్రాంచీలకు వినియోగదారుల తాకిడి పెరిగిపోయే ప్రమాదముండటంతో పునరాలోచనలో పడ్డాయి. నగదు విత్ డ్రాయల్స్, ఇతర సేవల కోసం కస్టమర్లు నేరుగా బ్యాంకుకే వస్తారు. ఖాతాదారులంతా నేరుగా బ్యాంకుకు వస్తే ఒక్కో లావాదేవీపై రూ. 20కి పైగా భారం పడుతుందని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి వెల్లడించారు.
భారతీయ స్టేట్ బ్యాంక్ (43 వేల ఏటీఎంలు), ఐసీఐసీఐ బ్యాంకు (11,739 ఏటీఎంలు) హెచ్ డీఎఫ్సీ, యాక్సెస్ బ్యాంకులు తమ వినియోగదారులకు ఇప్పటి వరకు ఎలాంటి పరిమితిని విధించలేదు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఏటీఎం నుంచి నగదు లావీదేవీలంటే డబ్బులు విత్ డ్రా చేయడమే కాదు, బ్యాలెన్స్ ఎంక్వయిరీ చేసినా లావాదేవీ కిందే లెక్క.
ఐదుసార్లు ఉచితంగా లావాదేవీల పరిమితి దాటితే, ఆపై ప్రతి లావాదేవీకి 20 రూపాయల చొప్పున రుసుం చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వ్ బ్యాంకు మార్గదర్శకాల ప్రకారం మెట్రో నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో కొత్త నిబంధనలు శనివారం నుంచి అమలులోకి వస్తాయి.
ఐతే సొంత బ్యాంకుల ఏటీఎంల వాడకంపై పరిమితిని ఆయా బ్యాంకులే నిర్ణయించవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొనడంతో నెలవారీ ఉచిత లావాదేవీల సంఖ్య ఎంతకు పెంచితే బాగుంటుందనే ఆలోచనలో బ్యాంకులు ఉన్నాయి.