లేపేస్తా: బజార్లో తన్నింది, లేడీ రౌడీషీటర్ వార్నింగ్
బెంగళూరు: బెంగళూరు నగరంలో ఓ లేడీ రౌడీషీటర్ రెచ్చిపోయింది. మోసం చేసిందని ఆరోపిస్తూ స్నేహితురాలిని బజార్లోకి ఈడ్చుకుని వచ్చింది. బజార్లో ఈడ్చి ఈడ్చి ఆమెను తన్నింది. మా డబ్బు తిరిగి ఇవ్వకపోతే నిన్ను లేపేస్తా అని స్నేహితురాలికి వార్నింగ్ ఇచ్చింది.
దక్షిణ బెంగళూరులోని చెన్నమ్మనే అచ్చుకట్ట ప్రాంతంలో లేడీ రౌడీషీటర్ యశశ్విని మహేష్ (34) నివాసం ఉంటున్నది. అదే ప్రాంతంలో రౌడీ షీటర్ స్నేహితురాలు ఉషారాణి నివాసం ఉంటున్నది.
ఉషారాణి ఓ ప్రయివేట్ కోఆపరేటివ్ సొసైటి బోర్డు సభ్యురాలిగా పని చేస్తున్నది. లేడీ రౌడీ షీటర్ మీద నమ్మకంతో పరిసర ప్రాంతాల వారు ఆమె స్నేహితురాలు ఉషారాణి ఉన్న కో ఆపరేటివ్ సొసైటీలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఉషారాణి పెట్టుబడిదారులను మోసం చేసిందని ఆరోపణలు ఉన్నాయి.
గత నెల రోజుల నుంచి ఉషారాణి మాయం అయ్యింది. అప్పటి నుంచి లేడీ రౌడీషీటర్, కోఆపరేటివ్ సొసైటీలో పెట్టుబడులు పెట్టిన వారు ఆమె కోసం గాలిస్తున్నారు. సోమవారం అర్దరాత్రి అనూహ్యంగా ఉషారాణి ఇంటికి చేరుకునింది.
అక్కడ ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోవడానికి ప్రయత్నించింది. అంతే విషయం తెలుసుకున్న లేడీ రౌడీషీటర్ యశశ్విని మహేష్ దాదాపు 50 మందిని వెంట పెట్టుకుని ఉషారాణి ఇంటి దగ్గరకు వెళ్లింది.
ఇంటిలో ఉన్న ఉషారాణిని బయటకులాగి బజార్లో ఈడ్చిఈడ్చి తన్నింది. సుమారు ఒక గంట పాటు లేడీ రౌడీషీటర్ బజార్లో నానా హంగామా చేసింది. విషయం తెలుసుకున్న చెన్నమ్మనే అచ్చుకట్ట పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అయితే అప్పటికే లేడీ రౌడీషీటర్ అక్కడి నుంచి మాయం అయ్యింది. లేడీ రౌడీషీటర్ మీద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. గతంలో దినసరి కూలీలు, వ్యాపారుల మీద దాడులు చేసిన యశశ్విని మహేష్ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసింది.
తరువాత ఆమె పేరు రౌడీషీటర్ జాబితాలోకి వెళ్లింది. యశశ్విని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కోఆపరేటివ్ సభ్యురాలు ఉషారాణి మీద వచ్చిన ఆరోపణలపై పోలీసులు విచారణ చేస్తున్నారు.