10 రోజుల్లో 12 మంది తలలు నరికేసిన సౌదీ అరేబియా సర్కార్- చేసిన నేరమిదే !
భారత్ లో సర్వసాధారణంగా కనిపించే నేరాలకు గల్ఫ్ దేశాల్లో షరియా చట్టాల ప్రకారం విధించే శిక్షలు చూస్తే భయం పుట్టక మానదు. ముఖ్యంగా అత్యాచారాలు, మాదక ద్రవ్యాల సరఫరా, వాడకం, హత్యలు వంటి నేరాలకు గల్ప్ దేశమైన సౌదీ అరేబియా విధించే శిక్షలు మరోసారి అలాంటి నేరాలు చేసే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. అయినా నేరాల సంఖ్య తగ్గకపోవడంతో సౌదీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా ఇలాంటి శిక్షలు అమలు చేస్తోంది.
తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం 12 మందిని మరణశిక్ష కింద శిరచ్ఛేదం చేసింది. అదీ గత 10 రోజుల వ్యవధిలోనే కావడం విశేషం.వీరందరినీ మాదక ద్రవ్యాల సంబంధిత నేరాల కింద మరణశిక్ష విధించారు. వీరందరినీ కత్తితో తల నరికి ఈ శిక్షను అమలు చేశారు. ఇందులో ముగ్గురు పాకిస్తానీలు, నలుగురు సిరియన్లు, ఇద్దరు జోర్డానియన్లు, ముగ్గురు స్ధానికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలోనే సౌదీ అరేబియా అత్యధికంగా 81 మందికి మరణశిక్ష విధించింది. ఇది ఆధునిక సౌదీ చరిత్రలోనే అతిపెద్ద శిక్షల విధింపుగా రికార్డులకెక్కింది.
ఇలా శిరచ్ఛేదాలతో మరణశిక్షల విధింపును క్రమంగా తగ్గిస్తామని రెండేళ్ల క్రితం ప్రకటించిన సౌదీ అరేబియా సర్కార్.. తాజాగా వీటి సంఖ్య పెంచుకుంటూ వెళ్తుండటం అందరికీ ఆందోళన కలిగిస్తోంది. సౌదీ తీరుపై పలు మానవహక్కుల సంఘాలు, ఐరాస వంటి సంస్ధలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయినా సౌదీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యూఎస్ లో తలదాచుకున్న జర్నలిస్టు ఖష్షోగీని సైతం సౌదీ డెత్ స్వ్కాడ్ 2018లో హతమార్చింది. ఆ తర్వాత ఈ మరణశిక్షల విధింపును తగ్గిస్తామని చెప్పిన సౌదీ.. వెనక్కి తగ్గలేదు.