#AfghanWomen : తాలిబన్లకు మహిళల భారీ షాక్-వస్త్రధారణపై ట్వీట్ క్యాంపెయిన్ వైరల్
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలయ్యాక ప్రతీ అంశమూ వివాదాస్పదమవుతూనే ఉంది. ముఖ్యంగా ముస్లిం మహిళలు షరియా చట్టాల ప్రకారం బుర్ఖాలు ధరించాలన్న తాలిబన్ల సర్కార్ ఆదేశాలు ఇప్పుడు అక్కడి మహిళలకు ఇబ్బందికరంగా మారాయి. ఇన్నాళ్లూ ప్రజా ప్రభుత్వ పాలనలో స్వేచ్ఛగా తమ హక్కుల్ని అనుభవించిన మహిళలు ఇప్పుడు తాలిబన్ల ఆదేశాలను ధిక్కరించేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముల్లును ముల్లుతోనే తియ్యాలన్న సామెతను అమల్లో పెట్టేశారు. దీంతో తాలిబన్లకు ఇదో భారీ షాక్ గా మారుతోంది.
ఆప్ఘనిస్తాన్ మహిళల దుస్దితి
ఆప్ఘనిస్తాన్ లో రెండు దశాబ్దాల క్రితం తాలిబన్ల పాలన ఉండగా... మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా విద్య, వినోదం, సాంస్కృతిక విషయాల్లో మహిళలు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చదువుకునేందుకు వెళ్లిన మలాలా అనే విద్యార్ధినిపై కాల్పుల ఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రాచుర్యం పొందిందో అంతా చూశారు. చివరికి ఆప్ఘన్ మహిళల హక్కులపై పోరాడిన మలాలా నోబెల్ శాంతి బహుమతి కూడా అందుకుంది. అయితే ప్రజా ప్రభుత్వ పాలన వచ్చాక మహిళలు రెండు దశాబ్దాల పాటు స్వేచ్ఛా స్వాతంత్రాలతో జీవించారు. తిరిగి తాజాగా తాలిబన్ల పాలన మొదలుకావడంతో మహిళల్లో ఆందోళన మొదలైంది. కఠినంగా షరియా చట్టాల అమలు ప్రారంభం కావడంతో మహిళలకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఇన్నాళ్లూ ఓపిక పట్టిన మహిళలు ఇప్పుడు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.
మహిళల పరిస్ధితి మళ్లీ మొదటికి
ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలయ్యాక మొట్టమొదటిగా భయాందోళనలు వ్యక్తమైంది మహిళల హక్కుల విషయంలోనే. ఈసారి తాలిబన్ల పాలనలో మహిళల హక్కుల ఉల్లంఘన ఏ స్దాయిలో ఉంటుందో అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో ఈసారి మహిళలకు ప్రభుత్వంలో సైతం చోటిస్తామని తాలిబన్లు ప్రకటించారు. కానీ ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం వారికి చోటు దక్కలేదు. అదే సమయంలో వారిపై గతంలో ఉన్న ఆంక్షలన్నీ మళ్లీ యథావిథిగా అమలు కావడం మొదలైంది. దీంతో ప్రజా ప్రభుత్వ పాలన ముగిసిన స్వల్పకాలంలోనే మహిళల పరిస్దితి మళ్లీ మొదటికొచ్చేసింది.
తాలిబన్లపై మహిళల తిరుగుబాట్లు
షరియా చట్టాల ప్రకారం మహిళలు కచ్చితంగా బురఖా ధరించాల్సిందేనని తాలిబన్లు పెడుతున్న ఆంక్షలపై అక్కడి మహిళల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పలు చోట్ల మహిళలు రోడ్డెక్కుతున్నారు. తమ వస్త్రధారణపై తాలిబన్ల ఆంక్షల్ని వారు అంగీకరించే పరిస్ధితుల్లో లేరు. దీంతో పలు ప్రావిన్సుల్లో మహిళలు భారీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. వస్త్రధారణతో పాటు విద్య వంటి అంశాల్లో తమకు స్వేచ్ఛ నివ్వాల్సిందేనని వారు నినదిస్తున్నారు. తాలిబన్లు మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు. మహిళలు కోరుతున్న డిమాండ్లను నెరవేర్చేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్పేస్తున్నారు.
దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్దితులు చోటు చేసుకుంటున్నాయి.
రూటుమార్చిన ఆప్ఘన్ మహిళలు
తాలిబన్లు విధించిన షరియా నిబంధనలు అనుసరిస్తే తమ జీవితాలు మళ్లీ మొదటికొస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్న మహిళలు వారిపై తిరుగుబాట్లకు సిద్దమవుతున్నారు. అయితే సంప్రదాయ పద్ధతుల్లో రోడ్లపై చేసే తిరుగుబాట్లకు తాలిబన్ల దాడుల ముప్పు పొంచి ఉన్నందున వారు ఈ విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తాలిబన్లను చికాకు పెట్టేందుకు తమ ఇళ్ల వద్ద నుంచే ఇంటర్నెట్ ద్వారా భారీ వార్ కు తెరలేపుతున్నారు. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్ లో ఇంటర్నెట్ తో పాటు అన్ని సాంకేతిక వ్యవస్ధలు అందుబాటులో ఉండటంతో ఇళ్ల వద్ద నుంచే కొత్త కొత్త మార్గాల్లో తాలిబన్లపై వార్ ప్రకటిస్తున్నారు.
సంప్రదాయ దుస్తుల్లో ట్వీట్ వార్
తాలిబన్ల బురఖా ఆంక్షలను నిరసిస్తూ ఆప్ఘన్ మహిళలు ఇప్పుడు సంప్రదాయ దుస్తుల్లో ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాను వాడుకుంటూ తాలిబన్లపై పోరుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఫోజులిస్తూ ట్విట్టర్ లో ఆప్ఘన్ మహిళలు హంగామా చేస్తున్నారు. తాలిబన్ల బురఖా ఆంక్షలపై తమ వార్ ను తెలిపేలా ఆప్ఘనిస్తాన్ కల్చర్ పేరుతో హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఆప్ఘనిస్తాన్ సంప్రదాయ దుస్తులివే అంటూ వారు చేస్తున్న ట్వీట్లకు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ లభిస్తోంది. ఇది ఆప్ఘనిస్తాన్ సంస్కృతి, నేను ఆప్ఘన్ సంప్రదాయ దుస్తులే వేసుకున్నాను అంటూ ఓ మహిళ తాజాగా పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. మరో మహిళ అయితే
ఆప్ఘన్ మహిళల క్యాంపెయిన్ వైరల్
ఆప్ఘన్ మహిళలు ఇప్పుడు రకరకాల హ్యాష్ ట్యాగ్లతో ట్విట్టర్ లో హల్ చల్ చేస్తున్నారు. #DoNotTouchMyClothes , #AfghanistanCulture, #AfghanWomen ట్యాగ్ లతో తాలిబన్లపై వారు చేస్తున్న వార్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా మహిళల హక్కుల కోసం పోరాడుతున్న పలు సంఘాలు ఈ ట్వీట్ క్యాంపెయిన్ ను స్వాగతిస్తున్నాయి. ఇప్పటికైనా తాలిబన్లు మహిళలకు స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ ట్వీట్ క్యాంపెయిన్ లో మహిళలు పెడుతున్న ట్వీట్లకు ఆప్ఘన్ తో పాటు వివిధ దేశాల్లో లైక్ లు, షేర్లు, రీట్వీట్లు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.
Recommended Video
ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహం
తాలిబన్లు ఈసారి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత గతంతో పోలిస్తే కొత్తగా దర్శనిస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు ఇంటర్నెట్ లోనూ హల్ చల్ చేస్తున్నారు. ప్రతీ విషయాన్ని ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. ప్రెస్ మీట్ల వివరాలు సైతం ట్విట్టర్ లోనే పెడుతున్నారు. ఫొటోలైతే లెక్కలేనన్ని దర్శనమిస్తున్నాయి. ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు తాలిబన్లు తహతహలాడుతున్నారు. దీంతో ఇప్పుడు ఆప్ఘన్ మహిళలు సైతం వారిని ఎదుర్కొనేందుకు అదే ట్విట్టర్ ను ఆశ్రయిస్తున్నారు. సంప్రదాయ వస్త్రధారణతో ఫొటోలు తీసి అదే ట్విట్టర్ లో పెడుతున్నారు. దీంతో తాలిబన్లకు ఒళ్లు మండిపోతోంది. ఆప్ఘన్ మహిళల్ని ఎలా నియంత్రించాలో తెలియక వారు తలపట్టుకుంటున్నారు. రోడ్లపై జరిగే నిరసనల్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్న తాలిబన్లు.. ఇప్పుడు ఇంటర్నెట్ లో సాగే ఈ సోషల్ మీడియా వార్ ను నియంత్రించేందుకు కొత్త దారులు వెతుక్కుంటున్నారు.