ప్రతీ అమెరికన్ కు 5 వేల డాలర్లు- ట్రంప్ ఆఫర్..! సర్వేలు తేడాకొడుతున్న వేళ..!
అమెరికాలో ఈ ఏడాది నవంబర్ లో మధ్యంతర ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో అమెరికా చట్ట సభ కాంగ్రెస్ లో మెజార్టీ నిలుపుకోవడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు (Donald Trump) పెను సవాలుగా మారింది. ఓవైపు ఇరాన్ తో యుద్దం, ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ అమెరికా ఆర్ధిక వ్యవస్థను నాశనం చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్న ట్రంప్ కు ఈ ఎన్నికల్లో ఎదురుగాలి తప్పదని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ ఎన్నికల్లో గెలిస్తే ప్రతీ అమెరికన్ కు 5 వేల డాలర్ల చొప్పున ఇస్తానని ప్రకటించారు.
డల్లాస్ లో అమెరికా మధ్యంతర ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ట్రంప్.. నవంబర్ తర్వాత కాంగ్రెస్ ఉభయ సభలపై తమ పార్టీ నియంత్రణను నిలుపుకుంటే, ప్రతి అమెరికన్ వయోజనుడికి 5 వేల డాలర్లు డివిడెండ్ గా ఇస్తానని ఓ అసాధారణ వాగ్దానం చేశారు. దీనికి ఒక ట్రిలియన్ డాలర్లు ఖర్చవుతాయని అంచనా. అయితే ఇది ఆర్థికంగా, రాజకీయంగా ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనగా కనిపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో కూడా ట్రంప్ వెల్లడించలేదు.

నవంబర్లో ప్రతినిధుల సభను 230-205 ఓట్లతో, సెనేట్ను 51-49 ఓట్లతో డెమోక్రాట్లు గెలుచుకుంటారని డెసిషన్ డెస్క్ హెచ్క్యూ అంచనా వేస్తోంది. ఇతర సర్వేలు కూడా డెమోక్రాట్లకు అనుకూలంగానే ఉన్నాయి. ఈ సర్వేల్ని తోసిపుచ్చిన ట్రంప్.. ఈ ఎన్నికల్లో తానే బ్యాలెట్ లో ఉన్నట్లు ఊహించుకోవాలని మద్దతుదారులకు సూచించారు. తాజా సర్వేల్లో ట్రంప్ కు ఆమోదం రేటింగ్స్ 30కి పడిపోయాయి. ముఖ్యంగా అధిక ధరలు, ఇరాన్పై చేస్తున్న యుద్ధం పట్ల ఓటర్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయినా ఇరాన్ యుద్దాన్ని ట్రంప్ సమర్ధించుకున్నారు. అయితే దీని వల్ల ఆర్దిక వ్యవస్థకు నష్టం కలుగుతుందని మాత్రం అంగీకరించారు.














Click it and Unblock the Notifications
