అమెరికాలో భారతీయుల గుర్తింపు డెమోక్రాట్లుగానే- ఈసారి వారి మొగ్గూ అటేనా- తాజా సర్వే
అమెరికా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే సత్తా భారతీయులకు ఉందనే అంశంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. అందుకే ప్రతిసారీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు, అభ్యర్ధులు వీరి మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. భారత్ నుంచి నేతలను రప్పించి మరీ వారిని ఆకట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతారు. అయితే ఈసారి ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ మాత్రం రెండేళ్ల క్రితమే భారత ప్రధాని నరేంద్రమోడీతో పలు కార్యక్రమాలు నిర్వహించి భారతీయులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు కూడా సమయం లేని పరిస్ధితుల్లో భారతీయులు ట్రంప్వైపు నిలుస్తున్నారా లేక డెమోక్రాట్లకు మద్దతిస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది.

హోరాహోరీగా ఎన్నికలు..
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. అధ్యక్ష ఎన్నికలకు ముందు నిర్వహిస్తున్న పోలింగ్లో ఆన్లైన్ విధానంలో భారీగా ఓటింగ్ నమోదవుతోంది. కరోనా సమయంలో క్యూలో నిలబడి ఓట్లు వేయడం కంటే ముందుగా మెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తేనే మంచిదని ఎక్కువ మంది భావిస్తున్నారు. దీంతో గతంతో కంటే పదిరెట్లు ఎక్కువగా ఓటింగ్ జరిగినట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. ఇందులోనూ హోరాహోరీగానే పోరు సాగుతుండగా.. డెమెక్రాట్లకు మొగ్గు ఉండొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే తుది ఫలితాల్లో మాత్రం ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పలేని పరిస్ధితి. దీంతో తుది ఓటింగ్కు సంబంధించి సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

భారతీయుల మొగ్గు వారివైపేనా ?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారిన భారతీయ అమెరికన్ల మొగ్గుపై తాజాగా ఓ దేశవ్యాప్త సర్వే జరిగింది. ఇందులో పలు ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఈ సర్వేలో పాల్గొన్న భారతీయ అమెరికన్లలో అత్యధికులు డెమోక్రాట్లవైపే మొగ్గుచూపుతున్నట్లు తేలింది. సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది డెమోక్రాట్లవైపు మొగ్గుచూపగా.. 22 శాతం మంది రిపబ్లికన్ల వైపు మొగ్గారు. మరో 3 శాతం మంది తాము ఇంకా ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోలేదని చెప్పారు. మరో 3 శాతం మంది ట్రంప్, బిడెన్ కాకుండా మూడో అభ్యర్ధికి ఓటేస్తామని చెప్పారు. 2020 ఇండియన్ అమెరికన్ వైఖరుల సర్వే పేరుతో జరిగిన ఈ అభిప్రాయ సేకరణలో కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్, జాన్స్ హాప్కిన్స్ ఎస్ఏఐఎస్, పెన్సిల్వేనియా విశ్వవిద్వాలయం సంయుక్తంగా నిర్వహించాయి.

పనిచేయని మోడీ-ట్రంప్ కాంబినేషన్...
గతంలో మోడీ-ట్రంప్ కాంబినేషన్లో భారతీయులను రిపబ్లికన్లకు దగ్గర చేసేందుకు నమస్తే ట్రంప్, హౌడీ-మోడీ వంటి భారీ కార్యక్రమాలు నిర్వహించారు. వీటితో కొంత మేర భారతీయులు ట్రంప్కు దగ్గరయ్యారు. కానీ అదే సమయంలో ట్రంప్ అనుసరించిన రక్షణాత్మక ధోరణి, ముఖ్యంగా కరోనా సమయంలో ట్రంప్ వ్యవహారశైలితో భారతీయులకు ఇబ్బందులు తప్పలేదు. ఇదే ఇప్పుడు భారతీయులను రిపబ్లికన్ల స్ధానంలో డెమోక్రాట్లకు దగ్గర చేసినట్లు తాజా సర్వే ఫలితాలతో అర్ధమవుతోంది. డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష బరిలో భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్ ఉండటం కూడా దీనికి మరో కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న 4.16 మిలియన్ భారతీయుల్లో 1.9 అర్హులైన ఓటర్లు ఉన్నారు. వీరి ఓట్లు ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి.
Recommended Video

డెమోక్రాట్లుగా అత్యధిక భారతీయుల గుర్తింపు..
అమెరికాలో ఉన్న ఓటర్లలో ఎక్కువ శాతం మంది డెమోక్రాట్లుగానే గుర్తింపు పొందినట్లు కూడా ఈ సర్వేలో తేలింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న భారతీయుల్లో 56 శాతం మంది డెమోక్రాట్లుగా గుర్తింపు పొందినట్లు తాజా అంచనాలు చెబుతున్నాయి. కేవలం 15 శాతం మంది భారతీయులు మాత్రమే రిపబ్లికన్లుగా గుర్తింపు పొందారు. మరో 22 శాతం మంది స్వతంత్రులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ భావజాల ప్రకారం చూస్తే భారతీయులు స్పష్టంగా వామపక్ష భావజాలాన్ని వ్యతిరేకిస్తారని కూడా ఈ సర్వే తేల్చింది. భారత్తో పాటు ఇతర దేశాల్లో జన్మించిన భారతీయులతో పోలిస్తే అమెరికాలో పుట్టిన భారతీయుల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు సర్వే నిర్ధారించింది.












Click it and Unblock the Notifications