మళ్లీ హార్ముజ్ మూసేసిన ఇరాన్- ఇజ్రాయెల్ చర్యలతో అమెరికాకు షాక్..!
అమెరికా-ఇరాన్ మధ్య ఐదు నెలలుగా సాగుతున్న ఘర్షణకు తెరదించుతూ తాజాగా ఇరుదేశాలూ డిజిటల్ గా తాత్కాలిక శాంతి ఒప్పందం (US-Iran Deal)పై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) ని పూర్తిస్ధాయిలో తెరవాలని అమెరికా కోరగా ఇరాన్ అంగీకరించింది. అంతా సవ్యంగా సాగుతుందని భావిస్తున్న తరుణంలో మరోసారి ఎంట్రీ ఇచ్చిన ఇజ్రాయెల్ ఈ డీల్ ను మొత్తంగా చెడగొట్టేసింది. ఇరాన్ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ లెబనాన్ పై రెండు రోజులుగా వరుసగా దాడులు చేస్తోంది. దీంతో స్విట్జర్లాండ్ లో జరగాల్సిన అమెరికా-ఇరాన్ చర్చలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్ ఇవాళ ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని పేర్కొంటూ, వ్యూహాత్మకంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని నౌకా రవాణాకు మూసివేస్తున్నట్లు ఇరాన్ అత్యున్నత సంయుక్త సైనిక కమాండ్, ఖతమ్ అల్-అన్బియా ప్రధాన కార్యాలయం ప్రకటించింది. దక్షిణ లెబనాన్లో అమెరికా, ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని నిరంతరం ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ, దీనిని స్పష్టమైన విశ్వాస భంగంగా అభివర్ణిస్తూ, దానికి ప్రతిస్పందనగా ఈ మూసివేతను అమలు చేస్తున్నట్లు సైనిక కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ చర్యను తమ ప్రతిస్పందనలో మొదటి అడుగుగా ఇరాన్ అభివర్ణించింది. ఈ దురాక్రమణ కొనసాగితే, మరిన్ని చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించింది. కాల్పుల విరమణ ఒప్పందంలోని మొదటి నిబంధనలో పేర్కొన్న కట్టుబాట్లను ఇటీవలి పరిణామాలు ఉల్లంఘించాయని ఇరాన్ భావిస్తున్నట్లు ఆ ప్రకటనను బట్టి తెలుస్తోంది. దీంతో అమెరికా-ఇరాన్ చర్చలు కాస్తా బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. అయితే హార్ముజ్ పై తక్షణ సమాచారం లేని అమెరికా మాత్రం ఈ జలసంధి తెరిచే ఉందని చెబుతోంది. మరోవైపు హార్ముజ్ లో ఆయిల్ ట్యాంకర్ల రవాణా ఆగిపోయినట్లు ఇప్పటికే అంతర్జాతీయంగా వార్తలు వస్తున్నాయి.














Click it and Unblock the Notifications