అమెరికాకు అనూహ్య షాక్..! చర్చల కోసం ఇరాన్ 4 షరతులు..!
ఇరాన్ (Iran) తో సీజ్ ఫైర్ ఒప్పందం కోసం పాకిస్తాన్ లో చర్చలకు వచ్చిన అమెరికా బృందానికి ఆరంభంలోనే షాక్ తగిలింది. అమెరికాతో చర్చలు (US-iran talks)ప్రారంభించి, ముందుకు తీసుకెళ్లాలంటే నాలుగు షరతులకు అంగీకరించాలని ఇరాన్ తేల్చిచెప్పేసింది. దీంతో పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో అమెరికా-ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది.
అమెరికాతో జరగబోయే చర్చలకు ముందు, ఇరాన్ తన నాలుగు షరతులను పాకిస్తానీ మధ్యవర్తులకు తెలియజేసింది. వీటిలో
హార్ముజ్ జలసంధిపై నియంత్రణ, సార్వభౌమాధికారాన్ని అమెరికా అంగీకరించడం, యుద్ధం సమయంలో జరిగిన నష్టాలకు నష్టపరిహారం చెల్లించడం, స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులన్నింటినీ విడుదల చేయడం, ఏ ఒక్క దేశానికీ పరిమితం కాకుండా, మొత్తం ప్రాంతమంతటా సమగ్రమైన, సుస్థిరమైన, స్పష్టమైన కాల్పుల విరమణ అమలు చేయడం ఉన్నాయి. తుది ఒప్పందానికి ముందు ఈ షరతులు తప్పనిసరిగా నెరవేర్చాలని టెహ్రాన్ పట్టుబడుతోంది.

ఇందులో హార్ముజ్ పై ఇరాన్ నియంత్రణకు అమెరికా అంగీకరించే అవకాశం ఉంది. అయితే తమ నౌకలకు మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని కోరే అవకాశం ఉంది. ఇక యుద్ధ నష్ట పరిహారాన్ని అమెరికా చెల్లించే అవకాశం లేదు. దీనికి బదులు వాణిజ్య ఒప్పందం చేసుకుని ప్రయోజనం చేకూరుస్తామని ఆఫర్ చేయొచ్చు. మూడో షరతు అయిన ఖతార్ సహా విదేశాల్లో ఉన్న బ్యాంకుల్లో తమ ఆస్తుల్ని డీఫ్రీజ్ చేయడం. దీనికీ అంగీకరించవచ్చు. చివరిగా ఇరాన్ తో పాటు లెబనాన్ లోనూ కాల్పుల విరమణ అమలు కావాల్సిందేననన్న షరతుకు కూడా అమెరికా అంగీకరించవచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications