షాకింగ్: అవయవ వ్యాపారంలోకి ఐఎస్ఐఎస్?
వాషింగ్టన్: ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ మరో దారుణానికి సిద్ధమవుతోంది. అవయవాలను వేరొకరికి అమర్చేందుకు సేకరించే ప్రక్రియను ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) సమర్థిస్తున్నట్లు బయటపడ్డ పలు పత్రాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఈ ఉగ్ర సంస్థ అవయవ అక్రమ వ్యాపారాన్ని కూడా చేస్తోందేమోనన్న సంశయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఏడాది జనవరి 31వ తేదీతో ఉన్న ఓ పత్రంలో.. ఓ ముస్లిం ప్రాణాన్ని కాపాడటానికి బతికున్న బందీ నుంచి అవయవాలను తీసుకోవడానికి ఉగ్ర సంస్థ అగ్ర నాయకులు అంగీకరించారు. అంతేగాక, ఆ అవయవాన్ని తీసుకోవడం వల్ల సదరు బందీ ప్రాణాలకుముప్పున్నా ఉగ్రసంస్థకు ఎలాంటి అభ్యంతరమూ లేదు.
కానీ, ప్రస్తుత పత్రం ప్రామాణికతపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు సిరియాలో మే నెలలో ప్రత్యేక దళాలు చేపట్టిన దాడుల్లో.. కొంత సమాచారం లభ్యమైందని అమెరికా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పత్రం సైతం వాటిలో భాగమేనని వివరిస్తున్నారు. ఆ పత్రం ఓ ఫత్వా రూపంలో ఉందని, ఇస్లామిక్ స్టేట్ పరిశోధన, ఫత్వా సంఘం దాన్ని ఆమోదించిందని తెలిపారు.

కాగా, అవయవ అక్రమ రవాణాకు ఉగ్ర సంస్థ పాల్పడుతుందా? లేదా అనే అంశంపై ఆ పత్రంలో ఎలాంటి స్పష్టమైన సమాచారమూ లేదు. ‘ఇస్లాంను వ్యతిరేకించిన బందీల నుంచి సేకరణ' అని పత్రంలో రాసివున్నప్పటికీ.. వారిలోకి ఎవరెవరు వస్తారో దానిలో వివరించలేదు.
క్రైస్తవులు, షియాలు, తమ దృక్పథాలను అనుసరించని కొందరు సున్నీ ముస్లింలను ఐఎస్ బందీలుగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. మరోవైపు డబ్బుల కోసం ఐఎస్ మానవ అవయవాలను అమ్ముకుంటోందని ఇరాక్ ఆరోపిస్తోంది.
ప్రస్తుత పత్రాలపై ఐరాస భద్రతా మండలిలో చర్చించాలని అమెరికాలోని ఇరాక్ రాయబారి మహమ్మద్ అలీ అల్హాకిమ్ తెలిపారు. ఐఎస్ నిధులను ఎలా సమకూర్చుకుంటుందో తెలుసుకునేందుకు ప్రస్తుత పత్రాల్లో కొన్ని ఆధారాలు లభిస్తున్నాయని అమెరికా అధికారులు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications