అర్ధరాత్రి లఖ్వీ రిలీజ్, రహస్య ప్రాంతానికి! కాంగ్రెస్, బీజేపీ ఏమన్నాయ్
లాహోర్: ముంబై పేలుళ్ల మాస్టర్ మైండ్ లఖ్వీని పాకిస్తాన్ విడుదల చేసినట్లుగా పాక్ మీడియాలో శుక్రవారం నాడు వార్తలు వచ్చాయ. ప్రత్యేక మార్గం ద్వారా రహస్యంగా అతనిని అర్ధరాత్రి పూట పాకిస్తాన్ విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.
లఖ్వీని అర్ధరాత్రి పూట గోప్యంగా విడుదల చేయడం గమనార్హం. విడుదల అనంతరం అతనిని గుర్తు తెలియని ప్రాంతానికి తరలించారు. హైకోర్టు ఆదేశాలను ఆధారం చేసుకొని పాకిస్తాన్ లఖ్వీని విడుదల చేసింది. మరోవైపు లఖ్వీని పాకిస్తాన్ విడుదల చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
ఎన్టీయే అస్పష్ట విధానాల ఫలితమే లఖ్వీ విడుదల అని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. లఖ్వీ పైన యూపీఏ అన్ని ఆధారాలు సమర్పించిందని పేర్కొన్నారు. బీజేపీ ఊగిసలాటకు స్వస్తీ చెప్పాలన్నారు. లఖ్వీ విడుదల తీవ్ర నిరాశకు గురి చేసిందని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్ దౌత్యపరంగా సమాధానమిస్తుందని బీజేపీ చెప్పింది.
లఖ్వీ విడుదలను భారత్ తీవ్రంగా ఖండించింది. లఖ్వీ పైన ఆధారాలు చూపించే విషయంలో పాకిస్తాన్ తీవ్రంగా విఫలమైందని ఆరోపించారు. తాము పాకిస్తాన్తో చర్చించాలనుకున్నామని, అంతలోనే విడుదల చేశారని అధికార బీజేపీ చెబుతోంది.
కాగా, ముంబై 26/11 దాడుల ప్రధాన సూత్రధారి, లష్కర్ -ఏ-తోయిబా నాయకుడు జకి ఉర్ రహమాన్ లఖ్వీని విడుదల చెయ్యాలని లాహోర్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గురువారం కేసు విచారణ చేసిన హైకోర్టు.. లఖ్వీ నేరంపై సరైన ఆధారాలు సమర్పించలేదని పంజాబ్ ( పాకిస్థాన్) ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద పంజాబ్ ప్రభుత్వం (పాకిస్థాన్) లఖ్వీని అరెస్టు చేసి నిర్బంధించింది. లఖ్వీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు విచారణ చేసిన లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి మహమ్మద్ అన్వర్ ఉల్ హక్ పాకిస్థాన్లోని పంజాబ్ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేశారు.
"లఖ్వీపై ఆరోపణలు చేస్తున్నారు, అతని మీద కేసు నమోదు చేసి అరెస్టు చేసి నిర్బంధించారు. ఇంత జరిగిన తరువాత మీరు ఎందుకు సాక్ష్యాలు సేకరించలేకపోయారు" అని ప్రశ్నించారు. "మీరు సాక్షాలు సేకరించి న్యాయస్థానం ముందు సమర్పించండి తరువాత చూద్దాం" అని అన్నారు.
సరైన సాక్షాలు సమర్పించలేని కారణంగా నిర్బంధం ఎత్తివేస్తున్నామని, వెంటనే లఖ్వీని విడుదల చెయ్యాలని హైకోర్టు సూచించింది. రూ. 10 లక్షల విలువైన రెండు బాండ్లు కోర్టుకు సమర్పించాలని లఖ్వీ న్యాయవాదికి హైకోర్టు సూచించింది. తాము అన్ని సాక్ష్యాలు సమర్పించినా లఖ్వీని న్యాయస్థానం విడుదల చేసిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అంటున్నారు.