గల్వాన్ లోయలో షాకింగ్- భారత జెండా స్ధానంలో చైనా జెండా ? మోడీ వివరణ కోరిన రాహుల్
తూర్పు లడఖ్ పరిధిలోకి వచ్చే గల్వాన్ లోయలో చైనా దుస్సాహసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అక్కడ ఎప్పుడూ ఎగురుతూ ఉండే భారత జాతీయ పతాకం స్ధానంలో చైనా జాతీయ పతాకాన్ని ఎగరేసినట్లు సమాచారం. కొత్త ఏడాది సందర్భంగా గల్వాన్ లోయలో చైనా బలగాలు తమ జాతీయ పతాకాన్ని ఎగరేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. ఇందులో చైనా బలగాలు తమ జాతీయ పతాకాన్ని ఎగరేస్తున్న దృశ్యాలున్నాయి. దీంతో ఈ వీడియోపై విపక్షాలు మండిపడుతున్నాయి.
చైనా మీడియా రిపోర్టర్ ఒకరు తన ట్విట్టర్ పేజ్ లో కొత్త ఏడాది వేడుకల సందర్భఁగా గల్వాన్ లోయలో తమ సైనికులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన వీడియో పెట్టారు. ఇది బీజింగ్ లోని తియాన్మన్ స్క్వేర్ లో ఉన్నంత గొప్పగా ఉందని కూడా వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై భారత్ లో విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇదే కోవలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా స్పందించారు. గల్వాన్ లోయలో చైనా జాతీయ పతాకావిష్కరణ వార్తలపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు లడఖ్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ లో చైనా చొరబాట్లను అడ్డుకోవడంలో ఎన్డీయే సర్కార్ విఫలమైందంటూ రాహుల్ విమర్శలు గుప్పించారు. గల్వాన్ లో మన త్రివర్ణ పతాకం ఎంతో గొప్పగా కనిపించేది. ఇప్పుడు చైనా పతాకం కనిపిస్తోంది. దీనిపై చైనాతో పాటు ప్రధాని మోడీ మౌనాన్ని వీడాలని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
తాజాగా అరుణాచల్ ప్రదేశ్ లో 15 స్ధలాలకు చైనా పేర్లు మార్చడంపై రాహుల్ గాంధీ కేంద్రాన్ని నిలదీశారు. అయితే పేర్లు మార్చినంత మాత్రాన భారత్ కు అరుణాచల్ ప్రదేశ్ పై ఉన్న హక్కుల్ని మార్చలేరంటూ విదేశాంగశాఖ స్పందించింది. ఇప్పుడు ఏకంగా గల్వాన్ లోయలో భారత మువ్వన్నెల పతాకం స్ధానంలో చైనా జెండా ఎగరేసిన ఘటనపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.
🇨🇳China’s national flag rise over Galwan Valley on the New Year Day of 2022.
— Shen Shiwei沈诗伟 (@shen_shiwei) January 1, 2022
This national flag is very special since it once flew over Tiananmen Square in Beijing. pic.twitter.com/fBzN0I4mCi