డెమోక్రసీకి ముప్పు: కమలా హ్యారిస్ ఆందోళన, ఏం చేద్దామంటే
ప్రధాని నరేంద్ర మోడీని తన కార్యాలయానికి ఆహ్వానించారు అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్. ప్రపంచంలో ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న ముప్పు గురించి ఆమె ఒకింత ఆందోళన వ్యక్తం చేశారు. భారత్, అమెరికాలో ప్రజాస్వామిక సిద్ధాంతాలను, వ్యవస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇరు దేశాల్లో.. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామిక సిద్ధాంతాలను, వ్యవస్థలను కాపాడుకోవడం తప్పనిసరి అని స్పష్టంచేశారు.
దేశీయంగా ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి చేయవలసిన అంశాలు తప్పనిసరిగా చేయాలని కోరారు. ఇరు దేశాల ప్రజల ఉత్తమ ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత ఉభయ దేశాలపై ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పట్ల భారతీయుల నిబద్ధత గురించి తనకు తన వ్యక్తిగత అనుభవం, తన కుటుంబం ద్వారా తెలుసునని ఆమె చెప్పారు. ప్రజాస్వామిక సిద్ధాంతాలు, వ్యవస్థల కోసం కలలు కనడం ప్రారంభించేందుకు, వాటిని వాస్తవంగా సాధించేందుకు మనం కృషి చేయాలన్నారు. కాసేపట్లో అమెరికా అధ్యక్షుడు జో బిడైన్తో మోడీ మీట్ అవుతారు. ఆ తర్వాత క్వాడ్ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐదు రోజుల అమెరికా పర్యటనకు బుధవారం బయల్దేరి వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాతోపాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. కోవిడ్ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్ సదస్సులో దృష్టి పెడతామని అంతకుముందు మీడియాతో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.
ఈ నెల 25వ తేదీ వరకు మోడీ అమెరికా పర్యటన కొనసాగనుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. ప్రధాని మోడీ రెండోసారి పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు అమెరికా పర్యటన చేపట్టారు.