వైఎస్ వివేకా హత్య కేసు.. సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై విచారణ ... ఈ నెల 20కి వాయిదా
ఏపీలో నేటికీ చర్చనీయంశంగా మారిన మర్డర్ మిస్టరీ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసుపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఇటీవల కాలంలో సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదని, త్వరిత గతిన విచారణ జరిపించాలని , కేసును సీబీఐకి ఇవ్వాలని వేసిన పిటిషన్లపై ధర్మాసనం సుధీర్ఘంగా విచారించింది. అడ్వకేట్ జనరల్ లేకపోవడంతో హైకోర్టు విచారణ వాయిదా వేసింది. ఇక వివేకా హత్య కేసును సీబీఐకి ఇవ్వాలన్న పిటిషన్లపై వాదనలు ఈ నెల 20కి వాయిదా పడింది.

వివేకా కేసును సీబీఐ కి అప్పగించాలన్న పిటీషన్లపై వాదనలు
కేసును సీబీఐకు అప్పగించాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి, వివేకా సతీమణి సౌభాగ్యమ్మ, వివేకా కుమార్తె సునీత పిటీషన్లు వేశారు. ఇక వీరి తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. బీటెక్ రవి తరఫున కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసును రాష్ట్ర పోలీసులు సమర్థంగా వ్యవహరించలేదని ఈ కేసులో ఇద్దరు కింది స్థాయి పోలీసులను సస్పెండ్ చేశారని అయితే ఇప్పటి వరకు కేసులో పురోగతి లేదని పేర్కొన్నారు. అందుకే వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.

హత్యా జరిగి ఏడాది అవుతున్నా ఇంకా దోషులు ఎవరో తెలీని పరిస్థితి
హత్య జరిగి ఏడాది అవుతున్నా ఎలాంటి ఆధారాలను గుర్తించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వినిపించారు. హత్య చేసి, రక్తపు మరకలు తుడిచివేయడం జరిగినా అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారని పేర్కొన్నారు . ఇప్పటి వరకు డ్రైవర్ను అరెస్ట్ చేయలేదని , అది ఎందుకో తెలీదని పేర్కొన్నారు . జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సీబీఐ విచారణ చెయ్యాలని డిమాండ్ చేసి తీరా సీఎం అయ్యాక పిటిషన్ను ఉపసంహరించుకున్నారు అని పిటిషనర్ తన వాదనను కోర్టుకు వినిపించారు.

కేసు విచారణకు తమకు అభ్యంతరం లేదన్న సీబీఐ
అయితే పిటీషనర్ తరపు వాదనలు విన్న న్యాయమూర్తి ఇతరుల పిటిషన్ విషయాలు ప్రస్తావించవద్దని ఎవరి పిటీషన్ కు సంబంధించి అంత వరకే వాదన వినిపించాలని పిటిషనర్కు సూచించారు. తమ పిటిషన్ వరకు మాత్రమే మాట్లాడాలని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే.. సీబీఐకి ఇవ్వటానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా..? కౌంటర్ వేస్తారా..? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కౌంటర్ వేయమని సీబీఐ తరపు న్యాయవాది సైతం స్పష్టం చేశారు.

నేటికీ వీడని మర్డర్ మిస్టరీ
గత ఏడాది మార్చి 15న పులివెందులలోని తన స్వగృహంలో వైఎస్ వివేకానంద దారుణ హత్యకు గురయ్యారు. మొదట గుండెపోటుతో ఆయన మరణించారని అనుకున్నప్పటికీ.. ఆ తరువాత పోస్ట్మార్టంలో వివేకానంద రెడ్డిది హత్య అని తేలింది. ఇక నేటికీ ఈ మర్డర్ మిస్టరీ వీడలేదు. ఎవరు చంపారు ? ఎందుకు చంపారు ? అన్నది తెలియలేదు. ఇంకా కేసులో జాప్యం కొనసాగుతున్న నేపధ్యంలో సీబీఐ కి అప్పగించాలని వివేకా కుటుంబ సభ్యులు సైతం డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications