Khammam News: నాలుగు నెలల క్రితం ప్రేమ పెళ్లి.. అంతలోనే ఆత్మహత్య..
ఎదిగిన కొడుకు, త్వరలో ఏదో ఒక ఉద్యోగం వస్తుందని తల్లిదండ్రులు ఆశతో ఉన్నారు. కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు అండగా ఉండాలని అతను కూడా ప్రయత్నంచాడు. చదువుకున్నాడు. ఇంతలో ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. పెళ్లి చేసుకున్నాడు. ఇక ఉద్యోగమే తరువాయి అన్నట్లుగా సిద్ధమయ్యాడు. కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎస్సై ప్రిలిమనరీ పరీక్ష
ఇటీవల జరిగిన ఎస్సై ప్రిలిమనరీ పరీక్ష సరిగా రాయలేదనే మనస్తాపంతో ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డా డు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం తాళ్లూరి వెంకటాపురం గ్రామానికి చెందిన అరిగెల రాజప్రకాష్ నాలుగు నెలల కింద ఓ యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. డిగ్రీ పూర్తి చేసిన వీరిద్దరు భార్యాభర్తలు ఖమ్మం బుర్హాన్పురంలో ఇల్లు అద్దెకు తీసుకుని ఎస్సై ఉద్యోగానికి సన్నద్ధమవుతున్నారు.
కీ చూసుకోగా
రాజప్రకాష్ భద్రాచలంలో, కవిత ఖమ్మంలో ఇటీవల ఎస్సై రాతపరీక్ష రాశారు. అనంతరం కీ చూసుకుంటూ తక్కువ మార్కులు వస్తున్నట్లుగా భావించారు. ఉద్యోగం రాదేమో అన్న భయంతో రాజప్రకాష్ ఆందోళన చెందాడు. అతని భార్య సర్దిచెప్పి బయటకు వెళ్లింది. వెంటనే తలుపు వేసుకున్న రాజప్రకాష్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు.
Recommended Video
తలుపు కొట్టగా..
తిరిగి వచ్చిన భార్య తలుపు తట్టగా తలుపు తీయలేదు. దీంతో తలుపు పగలగొట్టి చూడగా రాజప్రకాష్ ఫ్యాన్ కు వేలాడుతీ కనిపించాడు. ప్రేమ పెళ్లి చేసుకోవడం, ఎవరికీ ఉద్యోగాలు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది.