కార్పొరేటర్ ను కొట్టి, కారుకు నిప్పు - ఖమ్మంలో అనూహ్య సంఘటన - అసలేం జరిగిందంటే..
పదుల సంఖ్యలో పోగైన జనం ఒక్కసారిగా కార్పొరేటర్ పైకి దూసుకెళ్లారు.. కారు కదలని స్థితిలో కిందికి దిగిన ఆయనను చితక్కొట్టే ప్రయత్నం చేశారు.. ప్రాణభయంతో ఆ కార్పొరేటర్ ఓ స్కూల్లోకి పారిపోయారు.. లోపల తలుపులేసుకుని పోలీసుల సాయం కోరారు.. ఖాకీల రంగప్రవేశం తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.. పోలీసులు కార్పొరేటర్ ను కాపాడబోగా.. ఆందోళనకారులు అతని కారుకు నిప్పుపెట్టారు..
ఖమ్మం జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకున్న ఈ అనూహ్య సంఘటనపై స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలివి.. ఖమ్మం నగరంలోని ఒకటవ డివిజన్ కైకొండాయగూడెంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. స్థానికుల వివరణ ప్రకారం.. ఆగస్టు 18న తేజ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. యువకుడి మృతికి స్థానిక కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనలు చేపట్టారు.

మంగళవారం కూడా రోడ్డుపై ఆందోళన చేస్తున్న సమయంలో కార్పొరేటర్ నాయక్ కైకొండాయగూడెం వైపునకు వచ్చారు. ఆయన రాకను పసిగట్టిన బాధిత కుటుంబ సభ్యులు.. వాహనాన్ని ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. దీంతో కార్పొరేటర్ అక్కడే ఉన్న స్కూల్లోకి వెళ్లి తలుపులేసుకుని దాక్కున్నారు. ఈ లోపే ఘటనకు సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు..
కార్పొరేటర్ రామ్మూర్తి నాయక్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ముందుగా ఆయన్ని అక్కణ్నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాహనంలో ఎక్కించి తరలించేలోపే బంధువులు అడ్డుకుని కారుకు నిప్పు పెట్టారు. దీంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ఏసీపీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టారు. దీనిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications