ఖమ్మంలో మంకీ పాక్స్ అనుమానాస్పద కేసు.. హైదరాబాద్ తరలింపు
ఇంకా కరోనా మహమ్మారి నుండి బయట పడకముందే, ప్రపంచాన్ని మంకీ పాక్స్ మహమ్మారి వణికిస్తున్న విషయం తెలిసిందే. భారతదేశంలోని ఈ మహమ్మారి అనేక రాష్ట్రాలలో విస్తరిస్తున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో నిన్న మొన్నటి వరకు మంకీ పాక్స్ కేసు అని ఆందోళన వ్యక్తం కాగా, తాజాగా ఆ వ్యక్తికి సంబంధించిన రిపోర్టులు మంకీ పాక్స్ నెగిటివ్ అని తేల్చాయి. దీంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే లోపే ఖమ్మం జిల్లాలో మరో మంకీ పాక్స్ అనుమానిత కేసు నమోదైంది.
ఖమ్మంలో వలసకూలీకి మంకీ పాక్స్ లక్షణాలు
ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలో 32 ఏళ్ల వలస కూలీకి మంకీ పాక్స్ వ్యాధికి సంబంధించి అనుమానించబడిన లక్షణాలు కనిపించాయి. ఉత్తరప్రదేశ్కు చెందిన సందీప్ ఖమ్మం జిల్లాలో గ్రానైట్ ఫ్యాక్టరీ లో పని చేస్తున్నారు. ఇక ఈ వ్యక్తి చర్మంపై దద్దుర్లు మరియు మంకీ పాక్స్ ఇతర లక్షణాలతో మంగళవారం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారని వర్గాలు తెలిపాయి. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతని శరీరం పై నల్లటి మచ్చలు రావడంతో అతను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళాడు.
మంకీ పాక్స్ చికిత్సకు నోడల్ సెంటర్ అయిన హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రికి తరలింపు
దీంతో అక్కడి వైద్య సిబ్బంది అనుమానిత కేసుగా జిల్లా వైద్య శాఖ అధికారులకు సమాచారం అందించారు. వీడియో ద్వారా సందీప్ శరీరంపై మచ్చలను పరిశీలించిన అధికారులు అనుమానిత కేసుగా హైదరాబాద్లోని నల్లకుంటలో మంకీ పాక్స్ చికిత్సకు నోడల్ సెంటర్ అయిన ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. అతను ఒక వారం క్రితం తన సొంత రాష్ట్రంలో జరిగిన వివాహ వేడుకకు హాజరైన తర్వాత ఉత్తరప్రదేశ్లోని తన స్వగ్రామం నుండి అరెంపులకు తిరిగి వచ్చాడు.
మంకీ పాక్స్ విషయంలో జాగ్రత్త ..
అతను గత కొన్ని రోజులుగా సోరియాసిస్ వంటి చర్మ వ్యాధితో బాధపడుతున్నాడని, వలస కార్మికుడిని ఔట్ పేషెంట్ వింగ్లో పరిశీలించిన వైద్యులు అతని పాత హెల్త్ రికార్డును చూసి చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ తరలించి అతని నమూనాలను పరీక్షకు పంపారు. మంకీ పాక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. చనిపోయిన కోతులను తాకడం ద్వారా ఇన్ ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
మంకీ పాక్స్ లక్షణాలు ఇవే
మంకీ పాక్స్ కు డెంగీ లక్షణాలు కూడా ఉంటాయని, దీనివల్ల 5-10శాతం మరణాలు సంభవిస్తాయని వైద్యులు చెప్తున్నారు. ఈ వ్యాధి సోకిన వారు ముఖ్యంగా జ్వరం విపరీతమైన తలనొప్పి, వికారంగా ఉండటం, వాంతులు అవుతుండడం, కండరాలు పట్టేయడం, కంటి దృష్టి తగ్గిపోవడం, ప్రతిస్పందనలు తగ్గిపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. కరోనా మహమ్మారి తరహాలోనే మంకీ పాక్స్ కు ఎటువంటి ప్రత్యేకమైన వైద్య చికిత్స అందుబాటులో లేదు. లక్షణాలను బట్టి మాత్రమే చికిత్స చేయాల్సి ఉంటుంది.