సాఫ్ట్వేర్ ఇంజినీర్ దారుణ హత్య: గొంతు, కాళ్లు, చేతులు కోసి పాశవికం
భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలోని టేకులపల్లి మండలంలో ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అప్పు ఇచ్చిన వ్యక్తి.. ఆ డబ్బు తిరిగి ఇవ్వమన్నందుకు కక్ష పెంచుకుని అతడ్ని అత్యంత కిరాతకంగా హతమార్చారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తెలిసిన వ్యక్తే కావడంతో అప్పు ఇచ్చిన టెక్కీ అశోక్
వివరాల్లోకి వెళితే.. ముత్యాలంపాడు క్రాస్రోడ్ పంచాయతీలోని శాంతినగర్కు చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ పెద్ద కుమారుడు ధారావత్ అశోక్ కుమార్(24) ఖమ్మంలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య, రెండు నెలల పాప ఉన్నారు. అయితే, అశోక్.. తెలిసిన వ్యక్తే కావడంతో ముత్యాలంపాడు క్రాస్రోడ్కు చెందిన గుగులోత్ ప్రేమ్ కుమార్కు అవసరమైనప్పుడు అప్పు ఇచ్చేవాడు. ఇలా ప్రేమ్ కుమార్ రూ. 80 వేల వరకు అశోక్ కు బాకీ పడ్డాడు. అంతేగాక, ప్రేమ్ కుమార్ మధ్యవర్తిత్వంతో మరో వ్యక్తికి కూడా అశోక్ కుమార్ అప్పు ఇచ్చినట్లు తెలిసింది.

డబ్బు తిరిగివ్వమన్నందుకు టెక్కీని కిరాతకంగా హత్య చేశారు
తన డబ్బు తిరిగి ఇవ్వాలని అశోక్ ఇద్దరినీ పదే పదే అడుగుతుండటంతో వారు ఇతనిపై కక్ష పెంచుకున్నారు. శనివారం రాత్రి డబ్బులిస్తానని ప్రేమ్ కుమార్ చెప్పడంతో అశోక్ తన బైక్పై ముత్యాలంపాడు క్రాస్రోడ్కు చేరుకున్నాడు. నిందితులు ముందు వేసుకున్న పథకం ప్రకారం.. అశోక్ ను స్థానిక పంచాయతీ కార్యాలయంలోకి తీసుకెళ్లి గొంతు కోశారు. చేతిమణికట్టు, కాలి చీలమండల నరాలు కూడా కోసి కిరాతకంగా అశోక్ను హత్య చేశారు. ఆదివారం తెల్లవారి కూడా అశోక్ ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అశోక్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఇల్లెందు డీఎస్పీ రమణమూర్తి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు.

నిందితుడి ఇంటిపై దాడి, గంజాయి బ్యాచ్పై అనుమానం
బాలాజీ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రేమ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
అయితే, హత్య చేసింది గంజాయి బ్యాచ్ పని అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగూడెం, ఖమ్మంకు చెందినవారితోనే హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అశోక్ హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు ఆందోళన చేపట్టారు. ఆగ్రహంతో ప్రేమ్ కుమార్ ఇంటిపై దాడి చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అశోక్ మృతితో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.












Click it and Unblock the Notifications