శాంతిపురంలో... అశాంతి రేపిన టీడీపీ,వైసీపీ బ్యానర్ల వివాదం..! బాబు పర్యటన నేపథ్యంలో వెడెక్కిన కుప్పం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేడు, రేపు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు . రెండు రోజుల పాటు ఆయన చిత్తూరు జిల్లా కుప్పంలోపార్టీ నాయకులను, కార్యకర్తలను, అభిమానులను కలవనున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ఆయన తొలిసారి కుప్పంలో పర్యటన చేస్తున్నారు. అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు తలెత్తాయి.
కేసీఆర్ కు చెక్ పెట్టే వ్యూహంలో అమిత్ షా .. ఎలా స్కెచ్ వేశారో తెలుసా !
చంద్రబాబు పర్యటన నేపధ్యంలో శాంతిపురంలో టెన్షన్
తాజాగా జరిగిన ఎన్నికల్లో తనను కుప్పం నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. ఇక రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన ప్రజలను కలిసి కృతజ్ఞతలు చెప్పనున్నారు. పార్టీ కార్యకర్తలను, అభిమానులతో ఆయన భేటీకానున్నారు. వారికి ధన్యవాదాలు చెప్పే ఉద్దేశంతో బాబు ఈ పర్యటన చేపట్టనున్నారు. ఈ మేరకు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలోని గ్రామాల్లో చంద్రబాబు టూర్ కొనసాగనుందని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటె వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య దాడులు కొనసాగుతున్నాయి . రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో నేటికీ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఇక తాజాగా చంద్రబాబు పర్యటన నేపధ్యంలో చిత్తూరు జిల్లాలో ఇరు పార్టీల కార్యకర్తలు మరోసారి బాహాబాహీకి దిగారు.
కేవలం బ్యానర్ల కోసం రగడ .. వైసీపీ బ్యానర్ల స్థానంలో టీడీపీ బ్యానర్లు కట్టటమే పంచాయితీకి కారణం
కుప్పం నియోజకర్గంలోని శాంతిపురంలో ఇవాళ టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాంతిపురంలో బ్యానర్లు ఏర్పాటు చేశాయి. ఈ బ్యానర్ల ఎర్పాతుపైనే ఇప్పుడు పెద్ద రగడ జరుగుతుంది. అసలు వైసీపీ, టీడీపీ శ్రేణులకు గొడవకు దిగటానికి పెద్ద కారణం అవసరం లేదు అన్న చందంగా పరిస్థితి తయారైంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లు , ఇంతకు ముందు వైసీపీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లు ఉన్న స్థానంలో కట్టటమే గొడవకు కారణం. ఈ క్రమంలో వాటిని తొలగించాలంటూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది .
మూడు గంటలు జాతీయ రహదారిపై బైఠాయించి టీడీపీ, వైసీపీ శ్రేణుల ఆందోళన .. పోలీసుల మాటను లక్ష్య పెట్టని శ్రేణులు ... కొనసాగుతున్న ఉద్రిక్తత
దీంతో దాదాపు 3 గంటల పాటు వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగాయి .దాదాపు మూడు గంటల పాటు జాతీయ రహదారిపై టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం కొనసాగింది. దీనిపై సమాచారం అందుకున్న రాళ్లబూదుగూరు, రామకుప్పం, గుడుపల్లె పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై వారిని చెదరగొట్టి ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.తమ బ్యానర్లకు అడ్డుగా ఏర్పాటు చేసిన టీడీపీ బ్యానర్లను తొలగించాలని వైసీపీ నాయకులు పట్టుబట్టారు. చంద్రబాబు పర్యటన ముగిసిన అనంతరం బ్యానర్లను స్వచ్ఛందంగా తొలగిస్తామని, అంతవరకు ఉంచాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. బ్యానర్లను తొలగించాల్సిందేనని వైసీపీ, తొలగించేది లేదని టీడీపీ భీష్మించుకొని కూర్చున్నాయి. . పోలీసుల మాటలను ఎవరూ వినని పరిస్థితి ఉంది .ఇరు వర్గాల్లో సంయమనం లేకపోవటంతో గ్రామంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న ఆందోళన కలుగుతుంది. చంద్రబాబు పర్యటన ముగిసే లోపు మరేం జరగనున్నాయో అని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.