ఆ జిల్లాలో చంద్రబాబు పరిస్థితేంటో ఇవ్వాళ్టితో తేలింది..!!
కర్నూలు: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి నిరసనల సెగ తగిలింది. ఆయనకు చేదు అనుభం ఎదురైంది. మూడు రాజధానులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోన్న ఆయనకు తొలిసారిగా ప్రతిఘటనలు ఎదురయ్యాయి. కర్నూలు జిల్లాలో ఆయన పరిస్థితి, పార్టీ స్థితిగతులు ఏమిటనేది ఈ ఘటనతో తేలిపోయింది. కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించడాన్ని వ్యతిరేకిస్తోన్న చంద్రబాబును జిల్లా అడ్వొకేట్లు అడ్డుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీ వ్యతిరేకం..
రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవస్థను అందుబాటులోకి తెస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల కిందటే నిండు అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడున్న అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే- ఉత్తరాంధ్రలోని విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, రాయలసీమలోని కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయిస్తామంటూ ప్రకటించారు. దీన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. న్యాయపోరాటం చేస్తోంది.
చంద్రబాబుకు నిరసనల సెగ..
దీని ప్రభావం ఇప్పుడు ఆయనపై పడింది. కర్నూలు జిల్లాలో పర్యటిస్తోన్న చంద్రబాబుకు న్యాయవాదుల నుంచి నిరసనల సెగ తగిలింది. ఆయన బస చేసిన హోటల్ను జిల్లా న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ముట్టడించడానికి ప్రయత్నించారు. కర్నూలును న్యాయ రాజధానిగా అంగీకరించాలని డిమాండ్ చేశారు. హోటల్ ముందు బైఠాయించారు. ఆయనకు వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినదించారు. ఇవే నినాదాలతో కూడిన ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు.
ర్యాలీల హోరు..
పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శనలను సైతం నిర్వహించారు అడ్వొకేట్లు. మూడు రాజధానులలో భాగంగా కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించడానికి మద్దతు ఇవ్వని చంద్రబాబు గో బ్యాక్ అంటూ బ్యానర్లను ఇందులో ప్రదర్శించారు. కర్నూలు నుంచి హైదరాబాద్కు రాజధానిని తరలించే క్రమంలో కుదిరిన శ్రీబాగ్ ఒప్పందాన్ని చంద్రబాబు గౌరవించాల్సిందేనని పట్టుబట్టారు న్యాయవాదులు. దీనిపై ఆయన స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా అభివర్ణించారు.
వైఖరేంటీ?
కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుపై తన వైఖరేమిటో చంద్రబాబు స్పష్టం చేయాలని అడ్వొకేట్లు సూటిగా ప్రశ్నించారు. ప్రదర్శనగా చంద్రబాబు బస చేసిన హోటల్కు బయలుదేరి వెళ్లడానికి ప్రయత్నించిన న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లడానికి అనుమతి ఇవ్వలేదు. దీనితో అడ్వొకేట్లు-న్యాయవాదుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఫలితంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారందరినీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
శ్రీబాగ్ ఒప్పందం..
ఈ సందర్భంగా న్యాయవాద సంఘాల ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. కర్నూలును న్యాయ రాజధాని చేయాలనేది శ్రీబాగ్ ఒప్పందంలో ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు పరిస్థితి అమ్మ పెట్టదు- అడక్కు తిననివ్వదన్నట్టుగా తయారైందని అన్నారు. మూడు రాజధానుల కోసం తాము ధర్మపోరాటం చేస్తోన్నామని చెప్పారు. మూడు రాజధానులకు మద్దతు ఇస్తే- చంద్రబాబుకు తాము జేజేలు పలుకుతామని స్పష్టం చేశారు.
వదిలే ప్రసక్తే లేదు..
ఈ విషయంలో చంద్రబాబును తాము వదిలే ప్రసక్తే లేదని న్యాయవాద సంఘాల ప్రతినిధులు తేల్చి చెప్పారు. రాయలసీమ జిల్లాలకు ఆయన ఎప్పుడొస్తాడా? అని తాము ఎదురు చూస్తోన్నామని అన్నారు. కర్నూలుకు హైకోర్టును తరలించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికీ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. దీన్ని అడ్డుకుంటే మాత్రం సీమ గడ్డపైనే పుట్టిన చంద్రబాబు అదే సీమ ద్రోహిగా మిగిలిపోతాడని అన్నారు.
బిగుసుకుంటోన్న ఈడీ ఉచ్చు - విచారణకు ఎమ్మెల్సీ ఎల్ రమణ: అస్వస్థతతో ఆసుపత్రికి..!!