ఒక్క ఛాన్సా.. సీమ వ్యతిరేకి, పర్యటించే రైట్ కూడా లేదు, బాబుపై బాషా ఫైర్
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఫైరయ్యారు. ఆయన పచ్చి అవకాశ వాదీ అని విమర్శించారు. ఇప్పుడు మరో ఛాన్స్ అని కపట నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఎంత చెప్పినా.. జనం నమ్మే స్థితిలో లేరని తెలిపారు. కర్నూలు జిల్లాలో పర్యటించి ఎంతో కొంత సానుభూతి పొందాలని చూస్తున్నారని పేర్కొన్నారు.
రాయలసీమ జిల్లాల్లో పర్యటించే హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు. సీమ వ్యతిరేకి చంద్రబాబు అని మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమ ప్రాంతంలో పుట్టి, రాయలసీమలో రాజకీయంగా ఎదిగి, రాయలసీమ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ.. రైతులకు అన్యాయం జరుగుతోందని మాట్లాడుతున్నారని విమర్శించారు.

రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. ఏనాడూ రైతుల గురించి ఆలోచించకుండా, వ్యవసాయం దండగ అన్న వ్యక్తి ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నాడని అంజాద్ బాషా మండిపడ్డారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. ఇప్పుడు మరొక అవకాశం అంటున్నాడని, ఇవే తనకు చివరి ఎన్నికలు అని చెబుతున్నాడని విమర్శించారు.
ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చి గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తలకిందులుగా తపస్సు చేసినా ప్రజలు అవకాశం ఇవ్వరని స్పష్టం చేశారు. 14 ఏళ్లు నిన్ను చూశారని వివరించారు. చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చాక చేసిన పనులకు ఎక్కడా పొంతన లేదని ప్రజలు గుర్తించారని అంజాద్ బాషా తీవ్రస్థాయిలో స్పందించారు.












Click it and Unblock the Notifications