ఎన్నికల్లో పోటీ కంటే టీ స్టాల్ పెట్టుకోవడం బెటర్: టీడీపీ నేత: చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు
కర్నూలు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సహా పార్టీ అగ్ర నాయకత్వాన్ని ఆయన లక్ష్యంగా చేసుకుని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల తరువాత చాలామంది టీడీపీ నాయకులు ఆత్మహత్యలకు పాల్పడాల్సిన పరిస్థితులు రావొచ్చని పేర్కొన్నారు.
చంద్రబాబు పార్టీ నాయకులను నడిరోడ్డు మీద వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వద్ద ఉన్న డబ్బునంతా రాజకీయాలకే ఖర్చు చేశానని గుర్తు చేశారు. 2024 ఎన్నికల నాటికి తన ఆస్తి మొత్తం కరిగిపోతుందంటూ తిక్కారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే- రోడ్డు పక్కన టీ స్టాల్ పెట్టుకుని బతకాల్సి వస్తుందేమోనని అన్నారు. ఇది తన ఒక్కడి పరిస్థితి మాత్రమే కాదని.. రాష్ట్రంలో టీడీపీ నాయకులందరూ తనలాగే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు.
ఆస్తులను అమ్ముకుంటున్నారని తిక్కారెడ్డి వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికలు వస్తే అందరూ దివాళా తీస్తారని చెప్పారు. ఆ తర్వాత ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. రైతుల తరహాలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని, దీని నుంచి గట్టెక్కడానికి పార్టీ అగ్ర నాయకత్వం సహకరించాలని కోరారు. 2024లో తాను ఖచ్చితంగా గెలుస్తానని, వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మీద నియోజకవర్గంలో అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు.
2014, 2019 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిక్కారెడ్డి.. తెలుగుదేశం పార్టీ తరఫున మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాల నాగిరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. గతంలో బాల నాగిరెడ్డి- టీడీపీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అనంతరం ఆయన టీడీపీకి గుడ్బై చెప్పి, వైసీపీలో చేరారు. శాసన సభకు ఎన్నికయ్యారు. బాల నాగిరెడ్డి వైసీపీలో చేరడం వల్ల ఆయన స్థానంలో తిక్కా రెడ్డిని పార్టీ ఇన్ఛార్జ్గా నియమించింది టీడీపీ.