నల్లమలలో క్షుద్రపూజల పేరుతో జరిగిన హత్య... వీడిన చిక్కుముడి
నల్లమల అడవులలో క్షుద్రపూజల పేరుతో జరిగిన హత్యకు సంబంధించిన చిక్కుముడి వీడుతోంది. తొలుత ఇది క్షుద్ర పూజల పేరుతో జరిగిన హత్యగా భావించిన నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు జరిపారు. అయితే ఇది పక్కా ప్లాన్ తో చేసిన హత్య అని క్షుద్రపూజలతో ఏమాత్రం సంబంధం లేదు అని పోలీసులు తేల్చారు. నరబలిగా అనుమానించిన పోలీసులు మూడు రోజుల తరువాత ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా నిర్ధారించారు.

కర్నూలు మర్డర్ మిస్టరీ లో వీడిన చిక్కుముడి .. నరబలి కాదన్న పోలీసులు
కర్నూలు జిల్లా సిరివేళ్ల మండలం సర్వ నరసింహస్వామి దేవాలయం పరిసరాల్లో నరబలి జరిగిందన్న వార్త స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో మూడు రోజుల క్రితం ఆళ్లగడ్డలోని వాగు సమీపంలో తల మొండెం వేరు చేసి పాతిపెట్టిన ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహాన్ని పాతిపెట్టిన గోతిలో నిమ్మకాయలు ఇతర వస్తువులను పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ యువకుడిని దారుణంగా తల ,మొండెం వేరు చేసి హత్య చేశారు. ఆ యువకుడి దేహం , తల రెండూ వేరు చేయబడి వేర్వేరుగా పడి ఉండటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు . దీంతో గుప్త నిధుల కోసమే నరబలి ఇచ్చి ఉంటారని ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. గ్రామస్థుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మొదటి నరబలి గా అనుమానించిన పోలీసులు దర్యాప్తు తర్వాత ఇది నరబలి కాదు అంటున్నారు.

మృతుడు యువకుడు .. ప్రేమ గానీ మరే ఇతర కారణాలు కానీ మర్డర్ కు కారణం కావొచ్చన్న పోలీసులు
డెడ్ బాడీ ని వెలికి తీసిన పోలీసులు అతని తలను , మొండాన్ని గుర్తించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు . ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దర్యాప్తు ముమ్మరం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇది నరబలి కాదు అంటున్నారు పోలీసులు . ఇక అక్కడి సీసీ టీవీ పుటేజ్ ఇతర వివరాలు సేకరిస్తున్నారు.మృతుడిని నజీర్ భాషా గా గుర్తించారు . ఈ నెల 5 నుండి నజీర్ భాష అనే యువకుడు కనిపించడం లేదని ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. ఇక ఈ హత్యకు గురైన యువకుడు నజీర్ భాషానేనని పోలీసులు గుర్తించారు. చనిపోయిన నజీర్ భాష 25 సంవత్సరాల వయసున్న యువకుడు కాబట్టి ఏదైనా ప్రేమ వ్యవహారాలు కానీ, మరే ఇతర వ్యవహారాల్లో కానీ అతన్ని హతమార్చి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

గుప్త నిధుల కోసం జరిగిన నరబలి కాదని తేల్చిన పోలీసులు
మొత్తానికి ఏదో కారణంతో నజీర్ భాష హతమార్చి క్షుద్ర పూజల పేరుతో చంపినట్టుగా క్రియేట్ చేసి కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారు. అయినా పోలీసులు మాత్రం మృతుడి వివరాలు సేకరించి మృతుడికి సంబంధించిన మరేమైనా కారణాలున్నాయా అని దర్యాప్తు చేస్తున్నారు. మ్రుతుడికి ఉన్న శత్రువుల గురించి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇది గుప్తనిధుల కోసం జరిగిన నరబలి కాదని పోలీసులు తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications