23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్: తెలంగాణలో పెరుగుతున్న కేసులు, గచ్చిబౌలీలో ఆస్పత్రి
హైదరాబాద్: మహబూబ్నగర్లో మరో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసుల్లో 23 రోజుల పసికందుకు సైతం కరోనావైరస్ సోకినట్లు జిల్లా కలెక్టర్ వెంకట్రావు తెలిపారు. తాజా కేసులతో మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య ఏడుకు చేరుకుంది.

మర్కజ్కు వెళ్లొచ్చినవారితోనే..
కాగా, రెండ్రోజుల క్రితం ఆ పసికందు తండ్రితోపాటు నాయనమ్మకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజాగా ఆ కుటుంబంలో చిన్నారికి కూడా కరోనా సోకింది. మెరుగైన చికిత్స కోసం పసికందును సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఢిల్లీ మర్కజ్కు వెళ్లొచ్చిన వారి నుంచే తాజాగా ఈ ముగ్గురికి వైరస్ సోకినట్లు తెలిసింది.

పెరుగుతున్న కేసులు..
మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒకరికి కరోనా నయం కావడంతో డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆరుగురు చికిత్స పొందుతున్నారు. తాజాగా ముగ్గురికి కరోనా సోకడంతో వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్లో ఉన్నవారిని గుర్తించేందుకు వైద్యారోగ్య సిబ్బంది చర్యలు చేపట్టారు. కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 364 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 11 మంది మరణించారు. కాగా, నిజామాబాద్ జిల్లాలో మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Recommended Video

కరోనా ఆస్పత్రిగా గచ్చిబౌలి..
ఇది ఇలావుండగా, తెలంగాణలో కరోనా వ్యాపిస్తుండటంతో ప్రభుత్వం అందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కరోనా బాధితుల కోసం రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలో ప్రత్యేకంగా ఓ ఆస్పత్రిని సిద్దం చేస్తోంది. గచ్చిబౌలిలో స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆస్పత్రిగా మార్చేందుకు పనులు ముమ్మరంగా సాగతున్నాయి. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తోపాటు పలువురు ఉన్నతాధికారులు ఆస్పత్రి పనులను పరిశీలించారు. దాదాపు 15 అంతస్తుల్లో ఉన్న ఈ భవనంలో ఆప్పత్రి ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. స్పోర్ట్స్ కాంప్లెక్స్ భవనంలో పనులు పూర్తయితే దాదాపు 1500 పడకలు ఈ ఆస్పత్రిలో అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 15లోగా ఆస్పత్రిని సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు.












Click it and Unblock the Notifications