వామ్మో.. వీళ్లు మాములొళ్లు కాదు: రైతులను కూడా ఛీట్, ఇలా అరెస్ట్
మోసపోయేవాడు ఉన్నంత వరకు.. మోసం చేసే వానీ ఆటలు చెల్లుతూనే ఉంటాయి. అవును ఉద్యోగం పేరుతో ఛీటింగ్ కేసులు చూశాం.. రుణాల పేరుతో మోసం మాత్రం విచిత్రమే.. అవును చివరికీ రైతులను కూడా వదల్లేదు. రుణం పేరుతో మోసం చేశారు. ఇదీ మాత్రం కాస్త డిఫరెంటే. అదీ కూడా రైతులను.. బండి, జేసీబీ అని చెప్పి వంచించడం జీర్ణించుకోలేని అంశం. ఆ కేడీలను ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి.. కటకటాల్లోకి నెట్టారు.
సబ్సిడీ పేరు చెప్పి..
నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, రైతులకు 40 శాతం, 60 శాతం సబ్సిడీతో ట్రాక్టర్, మోటార్సైకిల్, జేసీబీ ఇప్పిస్తామని కుచ్చుటోపీ పెట్టినవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నేరస్తుడితోపాటు సహకరించిన మరో ఐదుగురిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. భువనగిరి యాదాద్రి జిల్లా రామాజపురం గ్రామానికి చెందిన వీరవల్లి ప్రదీప్రెడ్డి చైర్మన్గా మరో 14 మంది సభ్యులతో వీఎస్వీపీ ప్రైవేటు కంపెనీ నిర్వహిస్తున్నారని డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 100 మంది వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారు.
ఇక్కడ మోసాలు..
రంగారెడ్డి , ఖమ్మం, భూపాలపల్లి, కామారెడ్డి, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, జనగాం జిల్లాల నందు వీఎస్వీపీ ప్రైవేటు కంపెనీ పేరుతో ఉద్యోగాలు, రైతులకు ట్రాక్టర్లు, జేసీబీలు , బైక్లు ఇప్పిస్తామని లక్షల్లో వసూలు చేసి.. వారికి కనిపించకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. 2019లో ఉద్యోగాలు, ట్రాక్టర్లు, జేసీబీలు ఇప్పిస్తామని రూ.1.8 కోట్లు వసూలు చేయగా 2020లో 2 కోట్లపైగా వసూలు చేశారు. సంస్థ పేరు మీద నమ్మదగిన ప్రకటనలు ఇస్తూ మాయ మాటలు చెప్పి నిరుద్యోగులు, రైతులను మోసగించారు.
100 మంది బాధితులు
ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచే 100 మంది నిరుద్యోగులు 5 లక్షలోపు ఉద్యోగాల కోసం చెల్లించినట్లు , రైతులకు సబ్సిడీ పై జేసీబీలు, ట్రాక్టర్లు , బైక్లు ఇప్పిస్తామని ఈఎంఐల కంపెనీ చెల్లిస్తుందని రైతులు తమ వాటాగా లక్షన్నర కడితే సరిపోతుందని నమ్మబలికి వసూలు చేశారు. పేపర్లో వీఎస్వీపీ కంపెనీ పేరుతో ఉద్యోగాలు ఇస్తామని 2019లో ప్రకటన రావడంతో ఈ ఏడాది ఏప్రిల్ 19న నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లి గ్రామానికి చెందిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నల్లగొండ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
1.50 లక్షలు కట్టి..
వెంకట్రెడ్డి వీఎస్వీపీ కంపెనీలో కాంట్రాక్టు ఉద్యోగం కోసం రూ.1.50 లక్షలు చెల్లించాడు. బీఎస్ఎన్ఎల్లో కాంట్రాక్టు జాబ్ ఇప్పిస్తామని చెప్పి వీఎస్వీపీలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్గా ఎంపికైనట్లు జాయినింగ్ ఆర్డర్ను ఇచ్చారు. శిక్షణ పేరుతో కాలయాపన చేస్తూ జీతాలు ఇవ్వకుండా అనేక మంది నిరుద్యోగుల నుంచి డీడీల రూపంలో డబ్బులు తీసుకుని కంపెనీలోనే జాయిన్ చేసుకున్నారు. వందలాదిమందికి ఉద్యోగాలపై శిక్షణ ఇస్తున్నట్లుగా నమ్మబలికించారు. నిరుద్యోగులంతా సంస్థ చైర్మన్ వీరవల్లి ప్రదీప్రెడ్డిని ఇంకెంతకాలం అంటూ నిలదీయడంతో సంస్థకు అగ్రికల్చర్ ప్రాజెక్టు వచ్చిందని అందులో పనిచేస్తేనే జీతాలు ఇస్తామని నిరుద్యోగులను బెదిరించి సంస్థలో పని చేయించుకున్నారు.
13 మందికి ట్రాక్టర్లు..
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ద్వారా 13 మందికి ట్రాక్టర్లు, ఇద్దరికి బైక్లు సంస్థ సబ్సిడీ ఇస్తుందని ఇప్పించారు. ఒక్కొ రైతు నుంచి లక్ష50వేలు వీఎస్వీపీ సంస్థకు చెల్లించారు. 60 శాతం సబ్సిడీ వస్తుందని నమ్మబలికారు. ఈఎంఐ కడుతామని చెప్పారు. ఈఎంఐలు కట్టకుండా వీఎస్వీపీ సంస్థ తప్పించుకొని తిరుగుతున్నారు. ఇదే కేసులో కామారెడ్డి పోలీస్ స్టేషన్లో సంస్థ చైర్మన్ వీరవల్లి ప్రదీప్రెడ్డి, డైరెక్టర్ నవీన్రెడ్డిపై గతంలో కేసులు నమోదయ్యాయి. అయినా అతని తీరు మాత్రం మారలేదు. ఎప్పుడూ ఒకరినీ మోసం చేయాలనే చూస్తున్నాడు. తన పొట్ట నింపుకునేందుకు ఇతరులను మోసం చేస్తూనే ఉన్నాడు.
అరెస్ట్
నల్లగొండలోని రవీంద్రనగర్ కాలనీలో వీఎస్వీపీ కార్యాలయానికి వస్తుండగా సంస్థ చైర్మన్ ప్రదీప్రెడ్డి, నవీన్రెడ్డి, సంస్థలో పనిచేస్తున్న బిట్ల సాయి, జ్ఞానేశ్వర్, శ్రీనులను పట్టుకున్నట్లు తెలిపారు. భారీగా ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగుల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసిన వారిలో కొందరు నేరస్తులు పరారీలో ఉన్నారు. కారుకొండ వరప్రసాద్ , వీరవల్లి స్వాతి, కలమతుల్ల సతీష్రెడ్డి, కోమట్ల నవీర్రెడ్డి, సంజయ్ , శరత్, జలజ, సాయిరాం, అనుపమ, దివ్వా, తదితరులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిని విచారిస్తే మరింత మంది బాధితులు విషయాలు తెలిసే అవకాశం ఉంది. కానీ ఈ ముఠా మాత్రం మాములుగా ఛీట్ చేయలేదు.
Recommended Video
సందేహాలు
నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు పత్రికా ప్రకటనలో పేర్కొన్న పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించకపోవడంపై అనేక అనుమానాలకు తావిస్తోంది. ఏ ఉద్యోగానికి ఎంత డబ్బులు తీసుకున్నారు ..? ఏ ఏ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికారు...? ఉద్యోగాల జాయినింగ్ ఆర్డర్ ఇచ్చిన ఉత్తర్వుల కాపీ ఎక్కడ ప్రింట్ చేశారు. ...? ఇతర వివరాలేవీ వెల్లడించలేదు. మీడియా ముందు ప్రవేశపెట్టకపోవడంపై అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. సామాన్యుడి మదిని తొలుస్తోన్న ప్రశ్నలకు సమాధానం పోలీసులే చెప్పాలి.. లేదంటే ఏం జరిగిందనే విషయం మరగున పడే ఛాన్స్ ఉంది. నిజ నిజాలు చెప్పాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంది.