అరెరే... ఆ మాజీ మంత్రిని జగన్ కూడా రక్షించలేకపోతున్నారే??
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్కు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. నెల్లూరు నగర నియోకవరగం నుంచి వరుసగా ఆయన రెండు ఎన్నికల్లో విజయం సాధించారు. రెండోసారి విజయం దక్కించుకున్నప్పుడు మొదటి విడత మంత్రివర్గంలో కీలకమైన జలవనరులశాఖను దక్కించుకున్నారు. సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా రెండోవిడత మాత్రం ఇవ్వలేకపోయారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డికి మంత్రి పదవి దక్కింది. అప్పటి నుంచి నెల్లూరు జిల్లా రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.
Recommended Video
కాకాణి, రూప్ కుమార్ తో విభేదాలు?
కాకాణికి అనిల్కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమంటోందనే విషయం అందరికీ తెలిసిందే. కాకాణిపై అనిల్ ఇటీవలే పరోక్షంగా కొన్ని విమర్శలు చేశారు. మంత్రి పదవి పోయిన తర్వాత అనిల్కు అన్నీ కష్టాలే ప్రారంభమయ్యాయి. ఒకవైపు కాకాణితో విభేదాలు కొనసాగుతుండగా, మరోవైపు ఆయన బాబాయి, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్కుమార్యాదవ్ అబ్బాయితో విభేదించి సొంతంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కార్పొరేటర్లు కూడా కొందరు రూప్కుమార్వైపు వెళ్లిపోయారు.
సొంత పార్టీలోనే పోరాటం
తాను లేకపోతే అనిల్కు రాజకీయ భవిష్యత్తు ఉండేదా? అని రూప్కుమార్ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు నెల్లూరుకు చెందిన సీనియర్ రాజకీయవేత్త, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అనిల్ యాదవ్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో తన భార్యను నెల్లూరు నగరం నుంచి పోటీకి దింపాలనే యోచనలో వేమిరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తనకు నష్టం కలిగించేలా అనిల్ వ్యవహరించాలనే ఆగ్రహం వేమిరెడ్డిలో వ్యక్తమవుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీకంటే సొంత పార్టీలోనే తన వ్యతిరేకులపై ఆయన పోరాటం చేయాల్సి వస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సమయం వచ్చినప్పుడు అందరి సంగతి చెబుతా!!
నాలుగు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన అనిల్ కుమార్ యాదవ్ తనకు సొంత పార్టీలోనే వెన్నుపోటుదారులున్నారంటూ వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు వారి సంగతి చూస్తానని హెచ్చరించారు. మంత్రి పదవి పోయిన తర్వాత తనతోపాటు చివరివరకు ఉండేవారు ఎవరు? మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయిన వారెవరు? అనేదానిపై ఆయనకు ఒక స్పష్టత వస్తోందంటున్నారు. మరి.. రాబోయే రోజుల్లో ఆయన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.!!