తెగని నెల్లూరు పంచాయితీ: మరో నేతపై వేటు- ఆనం, కోటం..ఇప్పుడు కేతం
నెల్లూరు రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మొన్నటికి మొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీలో తిరుగుబాటు చేశారు. జనసేన పార్టీలోనూ అలాంటి పరిస్థితే నెలకొంది.
నెల్లూరు: రాష్ట్ర రాజకీయాల్లో నెల్లూరు పంచాయితీ కొనసాగుతూనే వస్తోంది. అందరి దృష్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా మీదే నిలిచింది. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జిల్లానే అయినప్పటికీ- ఒకరి తరువాత ఒకరుగా- ఆ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ నాయకులు తిరుగుబాటు లేవదీయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది. పార్టీ అగ్ర నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేశారా ఇద్దరు నాయకులు.

ఆనంతో షురూ..
ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గానికి సీనియర్ శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు రూరల్ కు చెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేశారు. సొంత పార్టీ ప్రభుత్వ పనితీరును తప్పుపట్టారు. తొలుత ఆనం రామనారాయణ రెడ్డి.. అధికార పార్టీపై తిరుగుబాటు బావుటా లేవదీశారు. ప్రభుత్వంపై బహిరంగంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పెద్దలనూ విమర్శించారు. అధికార యంత్రాంగాన్నీ తప్పుపట్టారు. మంత్రి పదవి లభించకపోవడం వల్లే ఆయన పార్టీకి వ్యతిరేకంగా గళం విప్పారనే విషయం బహిరంగ రహస్యమే.

ఆనం బాటలో కోటం
ఇప్పుడు అదే బాటలో నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నడిచారు. వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా ముద్ర ఉన్న ఆయన- జిల్లా అధికార యంత్రాంగంపై తరచూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో ఆయనను వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడటం, అసంతృప్తిని వ్యక్తం చేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకోవడం.. అవేవీ ఫలించకపోవడం వల్ల పార్టీకి దూరం కావడం అన్నీ చకచకా జరిగిపోయాయి.

ఇప్పుడు తాజాగా..
ఇప్పుడు తాజాగా నెల్లూరు జిల్లాకే చెందిన మరో సీనియర్ నాయకుడు పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయనే కేతంరెడ్డి వినోద్ రెడ్డి. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు. నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ ఛార్జ్. ఆయన ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి ప్రకటించారు. పార్టీ నిర్దేశించిన క్రమశిక్షణ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో కేతిరెడ్డి వినోద్ రెడ్డిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

పోటీ చేసి..
2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో కేతంరెడ్డి వినోద్ రెడ్డి- జనసేన పార్టీ అభ్యర్థిగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మూడో స్థానంలో నిలిచారు. 5,503 ఓట్లు ఆయనకు పోల్ అయ్యాయి. ఓటమి తరువాత ఆయన కుంగిపోలేదు. ఆయన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వస్తోన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గం పరిధిలోని అన్ని డివిజన్లల్లో విస్తృతంగా పర్యటించారు. జనసేన పార్టీని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలో ఉన్నారు.

క్రమశిక్షణ ఉల్లంఘన..
ఈ క్రమంలో 56వ డివిజన్ లో పర్యటిస్తోన్న సమయంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి అనుచరులు గొడవ పడటమే ఈ సస్పెన్షన్ కు కారణమని తెలుస్తోంది. స్థానికులతో వాగ్వివాదానికి దిగినట్లు ఫిర్యాదులు అందాయని, కేతంరెడ్డి వారిని వారించే ప్రయత్నం కూడా చేయనట్లు సమాచారం రావడాన్ని క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications