కరోనా ఎఫెక్ట్: కేసీఆర్ ఏపీ టూర్ షెడ్యూల్ క్యాన్సిల్: భార్యతో కలిసి విగ్రహ ప్రతిష్ఠాపనకు గెస్ట్గా
నెల్లూరు: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఏపీ పర్యటన చివరి నిమిషంలో రద్దయింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పర్యటన పూర్తి వ్యక్తిగతమే. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కొత్తగా నిర్మించిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని కేసీఆర్ సందర్శించాల్సి ఉండగా.. ఆ షెడ్యూల్ రద్దయింది.
నాయుడుపేట మీదుగా ప్రవహిస్తోన్న స్వర్ణముఖ నదీ తీరానికి సమీపంలో కొత్తగా శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని నిర్మించారు. శనివారం ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన, కుంభాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలంటూ ఆలయ పాలక మండలి సభ్యులు కేసీఆర్ను ఆహ్వానించారు. ఆలయ నిర్మాణానికి కేసీఆర్ భారీగా ఆర్థిక విరాళాన్ని ఇచ్చారని, అందుకే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించామని తెలిపారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోయారని అన్నారు. మరోసారి తప్పకుండా స్వామివారిని దర్శించుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు పాలకమండలి సభ్యులు పేర్కొన్నారు. ఆలయ మహారాజ గోపురం, తూర్పు మాడ వీధి నిర్మాణ ఖర్చును కేసీఆర్ భరించారని తెలిపారు. ఈ మేరకు విరాళ దాతల శిలాఫలకంలో కేసీఆర్ పేరును పొందుపరిచారు.
Recommended Video
నెల్లూరు జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. శనివారం నాటి బులెటిన్ ప్రకారం.. ఈ జిల్లాలో 28566 కేసులు నమోదు అయ్యాయి. ఒక్కరోజే 1096 కేసులు రికార్డు అయ్యాయి. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల్లో 22035 మంది డిశ్చార్జి అయ్యారు. 6263 యాక్టివ్ కేసులు జిల్లాలో రికార్డు అయ్యాయి. ఇప్పటిదాకా 268 మంది మృత్యువాత పడ్డారు. ఏపీలో తొలి కరోనా వైరస్ పాజిటివ్ కేసు వెలుగులోకి వచ్చింది ఈ జిల్లాలోనే.