నిజామాబాద్ లో బీఆర్ఎస్ కు అరవింద్ మార్క్ షాక్; ఫ్లెక్సీలతో టార్గెట్ కేసీఆర్!!
నిజామాబాద్ జిల్లాలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. బీఆర్ఎస్ వర్సెస్ బిజెపి వార్ కొనసాగుతుంది. నిన్నటికి నిన్న ఎంపీ అరవింద్ టార్గెట్ చేస్తూ ఇది మా ఎంపీ గారు తెచ్చిన పసుపు బోర్డు అంటూ నిజామాబాద్ అంతటా ఫ్లెక్సీలు ఏర్పాటు కాగా, ఇక ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలకు సంబంధించిన ఫ్లెక్సీలు, వైఫల్యాలను టార్గెట్ చేస్తూ నగరం అంతటా దర్శనమిచ్చాయి.
నిజామాబాద్ లో నువ్వా నేనా .. ఫ్లెక్సీల రచ్చ
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై నిజామాబాద్ పార్లమెంట్ అంతటా సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇక నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే కార్యాలయం గేట్ కి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఫ్లెక్సీ ని ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
ప్రజలకు బాండ్ పేపర్ మీద రాసిచ్చి పసుపు బోర్డు తీసుకువస్తానని హామీ ఇచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకురాకపోవడంతో నిన్న పసుపు రంగు బోర్డులను ఏర్పాటు చేసి అరవింద్ ను టార్గెట్ చేశారు . పసుపు రైతుల పేరుతో వెలసిన ఫ్లెక్సీల వెనుక బీఆర్ఎస్ ఉందని అసహనం వ్యక్తం చేసిన బిజెపి నేతలు వాటిని చించివేశారు.

సీఎం గారు మాట ఇస్తే తల నరుక్కుంటాడు కానీ ఇచ్చిన మాట తప్పడు.. వ్యంగ్యంగా ఫ్లెక్సీలు
ఇక నేడు నిజామాబాదు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫ్లెక్సీలలో యువకులు, రైతులు, గల్ఫ్ కార్మికులు, మహిళలు అన్ని వర్గాల ప్రజలను కెసిఆర్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో చెబుతూ నిరసన వ్యక్తం చేశారు. సీఎం గారు మాట ఇస్తే తల నరుక్కుంటాడు కానీ ఇచ్చిన మాట తప్పడంటూ వ్యంగ్యంగా ఫ్లెక్సీల పై రాసుకొచ్చారు.
ఆ హామీలు ఏమయ్యాయి? కేసీఆర్ సర్కార్ టార్గెట్
వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానన్న హామీ అమలయ్యేదెన్నడు? ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తానన్న డబుల్ బెడ్ రూములు ఎక్కడ అని ప్రశ్నిస్తున్న మహిళలు.. సమాధానం చెప్పండి? నిరుద్యోగులకు ఇస్తానన్న నెలకు 3016 రూపాయలు ఎక్కడ? కనీసం ఎంతమందికి ఇవ్వాలన్నా లెక్కలైనా ప్రభుత్వం దగ్గర ఉన్నాయా? ఓవైపు టీఎస్పీఎస్సీ నిర్వాకంతో ఉద్యోగాలు రాక,మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుద్యోగ భృతి అందక ఇబ్బంది పడుతున్న యువకులు అంటూ ఫ్లెక్సీలలో రాసుకొచ్చారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకీ ఫ్లెక్సీ
500 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తానన్న ఎన్నారై సెల్ ఎక్కడా?అని ప్రశ్నిస్తున్న గల్ఫ్ కార్మికులు, లక్ష రూపాయల రుణమాఫీ, ఉచిత ఎరువుల పంపిణీ అమలయ్యేదెప్పుడు అంటున్న రైతులు, దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బంధు హామీ ఏమైంది అని ప్రశ్నిస్తున్న దళిత సోదరులు అంటూ కెసిఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఏకరువు పెట్టారు. ఏకంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గేటుకి ఫ్లెక్సీ కట్టారు. దీంతో బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలను చించి వేశారు బీఆర్ఎస్ నాయకులు. మొత్తానికి నిజామాబాద్ రాజకీయం బిఆర్ఎస్, బిజెపి నేతల మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది.












Click it and Unblock the Notifications