కరోనా కొత్త స్ట్రెయిన్పై ఏపీ సర్కార్ ప్రకటన- పుకార్లు నమ్మొద్దు- వాస్తవమిదే...
ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన కరోనా వైరస్ మహమ్మారి నుంచి జనం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. భారత్లోనూ కరోనా ప్రభావం భారీగా తగ్గింది. శీతాకాలంలో కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని భావించినా అలాంటి సమస్యేదీ లేదని తేలిపోయింది. కానీ తాజాగా యూకేలో బయటపడిన కరోనా కొత్త స్ట్రెయిన్పై మాత్రం జనంలో భయాందోళనలు నెలకొంటున్నాయి.
ఏపీలో రెండు రోజుల క్రితం బ్రిటన్ నుంచి రాజమండ్రికి వచ్చిన మహిళకు ఈ కరోనా కొత్త స్ట్రెయిన్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. ఆమె శాంపిల్స్ను పూణే వైరాలాజీ ల్యాబ్కు పంపారు. ఆమెతో పాటే ఏపీకి వచ్చినా వేర్వేరు బోగీల్లో ప్రయాణించిన ఆమె కుమారుడికి మాత్రం తాజా పరీక్షల్లో నెగెటివ్గా తేలింది. దీంతో ఏపీలోనూ కరోనా కొత్త స్ట్ర్రెయిన్ ప్రభావం మొదలైందా అన్న ఆందోళన నెలకొంది. దీనిపై ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. రాజమండ్రిలో బయటపడిన కేసు మినహా ఏపీలో కొత్త కరోనా వైరస్ ఆనవాళ్లు ఎక్కడా కనిపించలేదని ఆరోగ్యమంత్రి ఆళ్లనాని ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పరీక్షల్లో ఎక్కడా కొత్త వైరస్ ఆనవాళ్లు దొరకలేదన్నారు.
బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమానాల నుంచి భారత్ చేరుకుంటున్న వారు, నేరుగా బ్రిటన్ నుంచి వచ్చే వారిపై ఏపీ ప్రభుత్వం నిఘా పెంచింది. రాష్ట్రంలోని అన్ని ఎయిర్పోర్టులను ఈ మేరకు అప్రమత్తం చేశారు. కరోనా నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాకే ప్రయాణికులను ఎయిర్పోర్టుల నుంచి బయటకు పంపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అలాగే ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల్లోనూ వైరస్ ఆనవాళ్లు ఉన్నాయేమో చూడాలని అధికారులను కోరింది.