ఐపీఎస్లు ఒక క్రిమినల్కు సెల్యూట్ కొట్టడం బాధగా ఉంది-పరోక్షంగా జగన్ను టార్గెట్ చేసిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అద్వాన్న స్థితిలో ఉన్నాయంటూ శ్రమదానం పేరుతో నిరసన చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్... రాజమండ్రి సభలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. బడుగు బలహీన వర్గాల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని... ఎన్నో దెబ్బలు తట్టుకుంటేనే పవన్ కల్యాణ్గా నిలబడ్డానని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.రాజమండ్రిలో సభ నేపథ్యంలో ఎక్కడికక్కడ జనసైనికులను అరెస్ట్ చేయడంపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పోలీసుల పట్ల తనకు బాధ కలుగుతోందన్నారు.

ఐపీఎస్లను చూస్తే బాధగా ఉంది : పవన్ కల్యాణ్
'పోలీస్ శాఖ వారికి విన్నపం... మీ కష్టాలు తెలిసినవాన్ని నేను... నా తండ్రి ఒక కానిస్టేబుల్... మీరు బారికేడ్లు వేసినా... లాఠీచార్జి చేసినా... అది మీ తప్పు కాదు... ప్రభుత్వ ఒత్తిడి వల్లే అలా చేస్తున్నారని అర్థం చేసుకోగలను.అయితే పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఒకటే అడుగుతున్నా. ఐపీఎస్ వంటి ఉన్నత చదువులు చదివిన పెద్దవాళ్లు సార్ మీరు... అందరికీ మార్గదర్శకుల్లా నిలవాల్సినవారు... అలాంటిది మీరు వెళ్లి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారికి సెల్యూట్ చేస్తుంటే మనసు చచ్చిపోతోంది.చాలా బాధగా ఉంది.' అని పవన్ వ్యాఖ్యానించారు.సీఎం జగన్ను ఉద్దేశించి పవన్ కల్యాణ్ పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తోంది.

రాజకీయాలు నాకు వ్యాపారం కాదు... బాధ్యత...
ప్రజాస్వామ్యంలో పనులు జరగనప్పుడు... రాజ్యాంగం కల్పించిన హక్కులు నెరవేర్చనప్పుడు ఇలాంటి కార్యక్రమాలు తప్పవన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఎవరూ అడ్డుకోలేరని హెచ్చరించారు.పోలీస్ వ్యవస్థను వాడుకుని... ఇబ్బందులు పెట్టి... రాజ్యాంగం కల్పించిన హక్కులను తొక్కేస్తే... తొక్కే కొద్ది పైకి లేస్తామని పేర్కొన్నారు. ఇలా రోడ్డు మీదికొచ్చి శ్రమదానం చేయడం తనకేమీ సరదా కాదన్నారు.ఒక బాధ్యత తెలిసిన వ్యక్తిగా తాను శ్రమదానంలో పాల్గొన్నానని... రాజకీయాలు తనకు వ్యాపారం కాదని.. ఒక బాధ్యత అని స్పష్టం చేశారు.

ఎన్ని దెబ్బలు తిన్నానో నాకు తెలుసు...
'సినిమా నటుడినయ్యాను కదా... ఇక ఆ తర్వాత రాజకీయాలే కదా అన్న ఫీలింగ్తో నేను రాజకీయాల్లోకి రాలేదు. చిన్నతనం నుంచే సామాజిక సమస్యలు చూస్తూ ఎదిగినవాడిని.ఒడిదుడుకులు తీసుకుంటూ... ఓటములను స్వీకరిస్తూ ముందుకెళ్లాలనే రాజకీయాల్లోకి వచ్చాను.వేల కోట్లు ఉండి మన హక్కులపై దాష్టికం చేసే ముఠాల నడుమ బడుగు బలహీనవర్గాల సాధికారత కోసం ముందుకు వచ్చాను.నన్ను టీవీల్లో పచ్చి బూతులు తిడితే భయపడుతానా.. పవన్ కల్యాణ్గా నిలబడ్డానికి ఎన్ని దెబ్బలు తిన్నానో నాకు తెలుసు. పార్టీ నాకోసం పెట్టలేదు... 7 దశాబ్దాలుగా కొంతమంది చేతికి అధికారం వెళ్లి మిగతావారికి అవకాశాలు రాలేదు.అందుకే జనసేన పెట్టాను.' అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కుల,మతాలకు అతీతంగా జనసేన...
కమ్మ సామాజికవర్గానికి తాను వ్యతిరేకం కాదని చెప్పేందుకే గతంలో టీడీపీతో కలిసి పోటీచేశానని పవన్ కళ్యాణ్ తెలిపారు.కాపు, తెలగ, ఒంటరి, బలిజ కులస్తులు నవ సమాజ స్థాపనకు నడుం బిగించాలన్నారు. కులాల మధ్య అంతరాలు సృష్టించి రాజ్యాధికారం లాక్కోవడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. జనసేన కుల,మత భేదాలకు అతీతంగా ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్ర రాజకీయాలు రెండిళ్ల మధ్య జరిగితే కుదరదని, ఒక కులాన్ని వర్గ శత్రువుగా చేసుకుని వైసీపీ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు.

సీఎం అని పదేపదే అరవకండి...
సీఎం అని పదేపదే అరవకండి అంటూ అభిమానులను పవన్ వారించారు.అలా జరిగినప్పుడు అరవండి... అప్పటిదాకా మనసులో దాచుకోండి... అరవకండి చేసి చూపించండి... అంటూ అభిమానులకు హితబోధ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద శ్రమదానం కార్యక్రమం నిర్వహించాలని తొలుత జనసేన ప్రకటించింది. అయితే అధికారులు అనుమతి నిరాకరించడంతో ధవళేశ్వరం నుంచి రాజమహేంద్రవరం హకుంపేటకు వేదికను మార్చారు.












Click it and Unblock the Notifications