కేసీఆర్ ఇలాకాలో వైఎస్ షర్మిల: ఆసక్తి రేపుతోన్న పర్యటన
మహబూబాబాద్: ఉద్యోగాల భర్తీకి సంబంధించిన సమగ్ర నోటిఫికేషన్ను సాధించడాన్ని లక్ష్యంగా చేసుకుని జనం బాట పట్టిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. ఈ మంగళవారం సిద్ధిపేట్ జిల్లాలో పర్యటించనున్నారు. రాజకీయంగా అత్యంత కీలకమైన సిద్ధిపేట్ జిల్లాలో ఆమె నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుండన్నపల్లిలో ఆమె దీక్షలో కూర్చోనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఈ నిరహార దీక్ష కొనసాగుతుంది.
ఇదివరకు- జాబ్ నోటిఫికేషన్ కోసం వైఎస్ షర్మిల చేసిన 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా ప్రతి మంగళవారం దీక్ష కొనసాగించేలా నిరుద్యోగ నిరాహర దీక్ష ఆందోళనను చేపట్టారు వైఎస్ షర్మిల. ప్రతి మంగళవారం ఎంపిక చేసిన జిల్లాలో 12 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తూ వస్తోన్నారు. తొలిసారిగా కిందటి నెల 13వ తేదీన వనపర్తి జిల్లా తాడిపర్తిలో నిరుద్యోగ నిరాహార దీక్షను ప్రారంభించారు.
తెలంగాణలో వేర్వేరు శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న లక్షా 90 వేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టడం, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకు ప్రకటించిన 50 వేల ఖాళీలను భర్తీ చేయడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్ను వెంటనే విడుదల చేయాలనేది వైఎస్ షర్మిల ప్రధాన డిమాండ్. ఈ నిరుద్యోగ నిరాహార దీక్ష ప్రధాన ఉద్దేశం అదే. వనపర్తి జిల్లాలో నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టిన తరువాత వైఎస్ షర్మిల కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్ వంటి జిల్లాల్లో ప్రతి మంగళవారం నిరాహార దీక్షను చేపడుతూ వచ్చారు.
ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావట్లేదనే నిరాశతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పరామర్శిస్తూ వచ్చారు. ఈ సారి ఆమె గజ్వేల్ జిల్లా గుండన్నపల్లిలో నిరుద్యోగ నిరాహారదీక్షలో కూర్చోన్నారు. 12 గంటల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఆమె వెంట వైఎస్సార్టీపీ నాయకులు పిట్ట రాంరెడ్డి, ఏపూరు సోమన్న, కొండా రాఘవరెడ్డి తదితరులు ఉంటారు. సిద్ధిపేట్ జిల్లా పార్టీ కోఆర్డినేటర్లు ఈ దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేస్తోన్నారు.
Recommended Video
రాజకీయంగా అత్యత ప్రాధాన్యత ఉన్న జిల్లా సిద్ధిపేట్. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు ఈ జిల్లాకు చెందినవారే. పైగా కేసీఆర్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే వైఎస్ షర్మిల దీక్షకు పూనుకోబోతోండటం ఆసక్తి రేపుతోంది. సాధారణ సమయంలోనే కేసీఆర్పై ఘాటు వ్యాఖ్యలు చేసే వైఎస్ షర్మిల.. ఇక ఆయన సొంత నియోజకవర్గంలోనే నిరుద్యోగ దీక్షకు పూనుకోబోతోండటం వల్ల ఇంకెలాంటి విమర్శలు చేస్తారనేది ఉత్కంఠతకు గురి చేస్తోంది.