అరసవల్లికి అని చెప్పి-ఢిల్లీకి వెళ్లారు: చంద్రబాబును నమ్ముకుంటే బోడిగుండే: అమరావతి రైతులపై
శ్రీకాకుళం: రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తోన్న ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే స్థాయిలో విమర్శనాస్త్రాలను సంధించారు. అటు అమరావతి ప్రాంత రైతులపైనా ఆరోపణలు గుప్పించారు. అరసవల్లి వరకు చేపట్టిన పాదయాత్రను అమరావతి ప్రాంత రైతుల మధ్యలోనే వదిలేయడం పట్ల ధర్మాన చురకలు అంటించారు.
అరసవల్లికి వస్తామని చెప్పి..
ఇవ్వాళ ఆయన శ్రీకాకుళంలో సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లతో సమావేశం అయ్యారు. అంబేద్కర్ ఆడిటోరియంలో ఏర్పాటైన ఈ భేటీకి శ్రీకాకుళం రూరల్, గార మండలాలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సచివాలయ కన్వీనర్లు, వలంటీర్లు హాజరయ్యారు. వారిని ఉద్దేశించి ధర్మాన ప్రసంగించారు. అమరావతి నుంచి అరసవల్లి వరకూ పాదయాత్ర చేపట్టిన రాజధాని రైతులు చివరికి ఢిల్లీ వెళ్లిపోయారని, దీనికి కారణాలేమిటో తెలుసా అని ప్రశ్నించారు.
ఆధార్ కార్డులు అడిగితేనే..
ఇందులో పాల్గొన్న రైతుల ఆధార్ కార్డులను హైకోర్టు అడగటం వల్లే వాళ్లు తమ యాత్రను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు. నిజమైన రైతులే అమరావతి పాదయాత్రలో పాల్గొని ఉంటే ఆధార్ కార్డులను ఎందుకు చూపించరని పేర్కొన్నారు. అరసవల్లి వరకు వస్తామని చెప్పి ఢిల్లీకి వెళ్ళిపోయారని చెప్పారు. అమరావతి అనేది రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం ఏర్పాటు చేసుకున్న నగరమని ధర్మాన ప్రసాదరావు అన్నారు.
ఎప్పుడైనా విశాఖ..
విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని ధర్మాన పునరుద్ఘాటించారు. రాజధాని ఏర్పాటైతే ప్రైవేటు సంస్థలు, పెట్టుబడులు భారీగా వస్తాయని, మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అడ్డుపడుతున్న చంద్రబాబు బుద్ధిని ప్రజలు ఇప్పటికే గ్రహించారని, ఎల్లో మీడియాలో పచ్చి అబద్ధాలు అచ్చు వేస్తూ పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వాటిని విశ్వసించొద్దని చెప్పారు.
మూడు రాజధానులు లేకపోతే..
మూడు రాజధానులే గనక లేకపోతే- హైదరాబాద్ తరహా పరిస్థితులు ఉత్పన్నమౌతాయని ధర్మాన అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి ఎలా కట్టుబట్టలతో ఏపీకి వచ్చామో, అలాంటి పరిస్థితితే భవిష్యత్తులో రావొచ్చని, అమరావతిలో చంద్రబాబు బినామీలు ఇతర జిల్లాలవారిని అడుగు కూడా పెట్టనివ్వరని అన్నారు. ఈ పరిస్థితి రాకూడదంటే విశాఖపట్నాన్ని రాజధానిగా చేసుకోవాలని, వైఎస్ఆర్సీపీని నిలబెట్టాలని ఆయన కోరారు.
దొంగలొస్తోన్నారు..
ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ కొందరు దొంగలు తిరుగుతున్నారని ధర్మాన ప్రసాద రావు టీడీపీ నాయకులను ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరు చంద్రబాబు కంటికి ఖర్మలా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రజలకు మిగిలేది బోడిగుండేనని తేల్చి చెప్పారు. తాము అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను గత ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోయిందని, ఇక్కడే తేడా కనిపిస్తోందని అన్నారు.