సిక్కోలులో సిత్రం: బతికుండగానే పాతి పెట్టబోయి, అరవడంతో సేవ్
మంచి లేదు, మానవత్వం లేదు. అవును అంతా కృత్రిమ బంధాలు, బంధుత్వాలే.. సిక్కోలులో జరిగిన ఘటన చూస్తే మనకు అలానే అనిపిస్తోంది. ఎందుకంటే వారి బంధువులే దారుణంగా ప్రవర్తించారు. బతికి ఉండగానే పాతి పెట్టబోయారు. స్థానికులు చూడబట్టి.. బతికి బట్టకట్టారు. లేదంటే ఇద్దరు మహిళలు చనిపోయేవారు.
శ్రీకాకుళం జిల్లా మందాస మండలం హరిపురంలో ఈ ఘటన జరిగింది. భూ వివాదం హత్య చేయడానికి దారితీసింది. తమ స్థలం ఆక్రమించారని అనడమే వారు చేసిన తప్పయిపోయింది. ప్రశ్నిస్తే.. వారిని ప్రాణం ఉండగానే పాతిపెట్టబోయారు. ఇద్దిరినీ మట్టిలో పూడ్చబోయారు. అయితే ఆ మహిళలు కేకలు వేశారు. దీంతో స్థానికులు అక్కడికి వచ్చి.. వారిని కాపాడారు.
వారిపై మట్టి కనిపించింది. వారు అరవకుండా అలానే ఉంటే.. పరిస్థితి మరోలా ఉండేది. ఆ ఇద్దరు మహిళలు చనిపోయేవారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఆ బంధువులపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వస్తోంది. ఆస్తి కోసం రెండు ప్రాణాలు తీయబోతారా అని మండిపడుతున్నారు.
ఈ రోజుల్లో ప్రేమ, అభిమానం తగ్గిపోయాయి. అందరికీ కాదు కొందరికే. అన్నింటికీ డబ్బే మూలం. డబ్బులు, భూమి, బంగారం.. ఇతర అంశాలనే కొందరు ప్రాతిపదికన తీసుకుంటున్నారు. దీంతో వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.