నైజీరియా జైలులో తెలంగాణ ఇంజనీర్ సహా 11 మంది ఇండియన్స్
న్యూఢిల్లీ: నైజీరియాలో ఒక తెలంగాణ ఇంజినీర్ సహా 11మంది భారతీయులు నిర్బంధంలో ఉన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. మహబూబ్నగర్ జిల్లా కొత్తకోటకు చెందిన మనోజ్కుమార్ అనే ఇంజినీర్ గత సంవత్సర కాలంగా నైజీరియా జైలులో ఉన్నాడు. ఇతనితో పాటు హర్యానా, హిమాచల్ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, చండీగఢ్ తదితర ప్రాంతాలకు చెందిన మరో పది మంది కూడా జైల్లో ఉన్నారు.
వీరి కేసు నైజీరియా కోర్టులో అక్టోబర్లో విచారణకు రానుంది. ఏడాదికాలంగా వీరు నిర్బంధంలో ఉన్నప్పటికీ ఈ ఏడాది మే నెలలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తరఫున అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇంజినీర్ మనోజ్ 2013లో ఘనాకు చెందిన ఒక ప్రైవేటు షిప్పింగ్ కంపెనీలో ఆయిలర్ (ఇంజనీరింగ్ విభాగం)గా చేరాడు.
నిరుడు జూలైలో ఘనా నుంచి కామెరూన్కు పాత ఇనుప సామాన్లను రవాణా చేస్తుండగా, నైజీరియాకు సమీపంలోని సముద్ర జలాల్లో వీరి నౌకకు సాంకేతికపరమైన సమస్య వచ్చింది. సుమారు నెలన్నర రోజులుగా అక్కడే మరమ్మతు పనులు చేసుకుంటూ ఉన్న పదకొండు మంది భారతీయులను నైజీరియాకు చెందిన నావికాదళం అదుపులోకి తీసుకున్నట్లు మంగళవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

మూడు నెలల పాటు కస్టడీలోనే ఉంచుకుని ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. నౌకలో పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేస్తున్నారని, సంబంధిత పత్రాలను చూపించలేకపోయారని నేవీ భద్రతా బలగాలు వీరిపై కేసు నమోదు చేశాయి. నిరుడు డిసెంబరులో ఈ కేసు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ క్రిస్మస్ సెలవుల కారణంగా వాయిదా పడిందని జైల్లో ఉన్న మనోజ్ సోమవారం సాయంత్రం ఫోన్ ద్వారా తెలిపారు. తిరిగి ఈ ఏడాది మే నెలలో విచారణకు వచ్చినప్పటికీ తదుపరి విచారణ జూలైకు, ఆ తర్వాత అక్టోబర్కు వాయిదా పడింది.
మనోజ్ తండ్రి దశరథ్ సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో రెసిడెంట్ కమిషనర్ శశాంక్ గోయల్ను కలిసి పూర్తి వివరాలు తెలిపారు. తన కుమారుడిని విడిపించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. ఆ తరువాత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి విజయ్ ప్రకాశ్ ద్వివేదీని కలిసి నైజీరియాలోని దౌత్య కార్యాలయం ద్వారా తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications