తెలంగాణలో ఒమిక్రాన్ కలవరం: కొత్తగా 12 కేసులు, మొత్తం 20కి చేరిన కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కలకలం సృష్టిస్తోంది. ఓ వైపు కరోనావైరస్ సాధారణ కేసులు క్రమంగా పెరుగుతుండగా.. ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతుండటం ప్రజల్లో భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా, భారీగా ఒమిక్రాన్ కేసులు పెరిగాయి.
తెలంగాణలో కొత్తగా 12 ఒమిక్రాన్ కేసులు, మొత్తం 20
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో 12 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 20కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు ఎట్ రిస్క్, నాన్ రిస్క్ దేశాల నుంచి 7206 మంది ప్రయాణికులు రాష్ట్రానికి రాగా, వారిలో 20 మందికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరో ముగ్గురి ఫలితాలు రావాల్సి ఉంది.
తెలంగాణలో కొత్తగా 185 కరోనా కేసులు, 3761 యాక్టివ్ కేసులు
తెలంగాణలో గత 24 గంటల్లో 41,484 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 185 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,79,430కి చేరింది. శుక్రవారం ఒకరు కరోనాతో మరణించారు. దీంతో మృతుల సంఖ్య 4041కి చేరింది. కరోనా బారి నుంచి శుక్రవారం 205 మంది కోలుకున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 3761 యాక్టివ్ కేసులున్నాయి. ఇలా ఉండగా, జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 78 కోవిడ్ కేసులు నమోదు కాగా, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో15, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 14 మంది చొప్పున, హన్మకొండ జిల్లాలో 11 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది.
దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు
కాగా, దేశంలోనూ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కర్ణాటక, కేరళ వరుసగా ఆరు, నాలుగు కేసులను నివేదించిన తర్వాత భారతదేశం ఒమిక్రాన్ కోవిడ్ సంఖ్య శనివారం 126 కి పెరిగింది. తాజా తెలంగాణ కేసులను కలుపుకుంటే ఆ సంఖ్య 138కి చేరింది. అంతకుముందు మహారాష్ట్రలో మరో ముగ్గురు వ్యక్తులు కూడా వేరియంట్కు పాజిటివ్ పరీక్షించారు. కేంద్ర, రాష్ట్ర అధికారుల ప్రకారం, 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు - మహారాష్ట్ర (43), ఢిల్లీ (22), రాజస్థాన్ (17), కర్ణాటక (14), తెలంగాణలో 8(తాజా 12 కేసులతో 20కి చేరింది), గుజరాత్ (7), కేరళలో ఓమిక్రాన్ కేసులు కనుగొనబడ్డాయి. (11), ఆంధ్రప్రదేశ్ (1), చండీగఢ్ (1), తమిళనాడు (1) పశ్చిమ బెంగాల్ (1). దేశంలోని మొదటి రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు డిసెంబర్ 2న కర్ణాటకలో కనుగొనబడినప్పటికీ, ఈ వైరస్ భారీగా పరివర్తన చెందిన వెర్షన్ నవంబర్ 24న దక్షిణాఫ్రికాలో మొదటిసారిగా నివేదించబడింది.