బండి సంజయ్ కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్; కరీంనగర్ జైలుకు తరలింపు
పదవ తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో ఏ 1 నిందితుడిగా పేర్కొని పోలీసుల అదుపులోకి తీసుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు ఈరోజు హనుమకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఈరోజు కోర్టుకు సెలవు దినం కావడంతో హనుమకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ఇంటి వద్ద బండి సంజయ్ ను హాజరు పరచిన పోలీసులు కేసులో ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ ముందు తమ రిమాండ్ రిపోర్టును దాఖలు చేశారు.
ఇరు వర్గాల వాదనలు విన్న ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ తీర్పును వెల్లడించారు. బండి సంజయ్ కు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. దీంతో బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ బిజెపి లీగల్ సెల్ ప్రతినిధులకు పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరును వెల్లడించారు. పోలీసులు తన పట్ల దురుసుగా వ్యవహరించారని, తనకు గాయాలయ్యాయని చొక్కా విప్పి లాయర్లకు బండి సంజయ్ చూపించారు.

కావాలనే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. కాగా పదవ తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఏ1 గా బండి సంజయ్ ను, ఏ2గా బూరం ప్రశాంత్ ను, ఏ3గా మహేష్ ను, ఏ 4 గా శివ గణేష్ ను, ఏ 5 గా మైనర్ బాలుడు ఉన్నాడని వరంగల్ సీపీ ఏ.వీ రంగనాథ్ వెల్లడించారు.
బండి సంజయ్ పేపర్ లీకేజీ వెనుక ప్రధాన సూత్రధారి అన్నారు. మొన్న సాయంత్రం బండి సంజయ్ తో ప్రశాంత్ వాట్సాప్ చాటింగ్ చేశాడని, ప్రశాంత్ చాటింగ్ లో పేర్కొన్న అంశాలను బండి సంజయ్ ప్రెస్ మీట్ లో మాట్లాడాడని తెలిపారు. అంతకు ముందు రోజు వాట్స్అప్ కాల్ లో బండి సంజయ్ తో ప్రశాంత్ మాట్లాడాడని వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు.












Click it and Unblock the Notifications