అమెరికాకు నో: 19 మంది విద్యార్థులను హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆపేశారు
హైదరాబాద్: అమెరికాకు బయలుదేరిన 19 మంది విద్యార్థులను హైదరాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం నుంచి దించేశారు. ఈ విద్యార్థులు అడ్మిషన్లు పొందిన అమెరికాలోని రెండు విశ్వవిద్యాలయాలు వివాదంలో చిక్కుకున్నాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల అడ్మిషన్లను అమెరికా అధికారులు స్క్కూటినీ చేస్తున్నారనే కారణంతో విద్యార్థులను విమానాశ్రయంలోనే ఆపేశారు.
రాజీవ్ గాంధీ విమానాశ్రయం నుంచి ఆదివారం రాత్రి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన విమానంలోకి 19 మంది విద్యార్థులను ఎక్కనీయవద్దని ఎయిర్ ఇండియా అధికారులు ఆదేశించారు. గతంలో ఈ రెండు విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులను శానిఫ్రాన్సిస్కోలో దిగిన వెంటనే అక్కడి నుంచే వెనక్కి పంపించేశారని ఎయిర్ ఇండియా అధికారులు సోమవారంనాడు చెప్పారు.

ఆ విద్యార్థుల టికెట్ల ధరలను ఎయిర్ ఇండియా వారికి ఇచ్చేస్తోంది. ఆ రెండు విశ్వవిద్యాలయాల విషయంలో స్క్టూటినీ జరుగుతోందని, శాన్ఫ్రాన్సిస్కోకు ఆ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం వచ్చే విద్యార్థులను అనుమతించబోమని, వెనక్కి పంపించేస్తామని అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈ నెల 19వ తేదీన తమకు సమాచారం ఇచ్చిందని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.
ఎయిర్ ఇండియా విమానంలో ఇప్పటి వరకు శాన్ఫ్రాన్సిస్కోకు వెళ్లిన 14 మంది విద్యార్థులన వెనక్కి పంపించినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు వన్ వె టికెట్పై అమెరికాకు ప్రయాణిస్తారని, తిరిగి వెంటనే వెనక్కి రావడానికి టికెట్ ధర భారీగా ఉంటుందని, వెనక్కి రావడానికి సీట్లు లభించే అవకాశాలు కూడా ఉండవని ఆ వ్రకటనలో వివరించారు.
పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని తమ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్న విద్యార్థులను అనుమతించలేదని చెప్పారు. ఎయిర్ ఇండియా అమెరికా కార్యాలయం నుంచి ఆ రెండు విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లకు క్లియరెన్స్ వచ్చినట్లు సమాచారం రాగానే అదనపు వ్యయం లేకుండా విద్యార్థులను తీసుకుని వెళ్తామని కూడా చెప్పారు.
అమెరికా ప్రభుత్వం తమను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు కొన్ని మీడియా సంస్థలు పూర్తిగా అబద్ధపు ప్రచారాన్నిసాగిస్తున్నాయని ఆ రెండు విశ్వవిద్యాల్లోని ఒక విశ్వవిద్యాలయం తన వెబ్సైట్లో స్పష్టం చేసింది.
అశోక్ గజపతిరాజు వివరణ
సిలికాన్ వ్యాలీ, ఎన్పియూ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి భారత్ నుంచి అమెరికా వెళ్తున్న విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నారని పౌర విమానయానాల మంత్రి పి. అశోక్ గజపతి రాజు చెప్పారు. ఆ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు అమెరికా ఇమిగ్రేషన్ ఇవ్వడం లేదని ఆయన చెప్పారు. ఆ రెండు విశ్వవిద్యాలయాలకు ఇండియా నుంచి అమెరికాకు వెళ్లరాదని సూచన చేసినట్లు ఆయన తెలిపారు. రేపు విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదిస్తామని ఆయన చెప్పారు. ఆ రెండు విశ్వవిద్యాలయాల స్టేటస్పై క్లారిటీ లేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications