తెలంగాణలో 3వేలకుపైగా కొత్త కేసులు, 20 మరణాలు: తగ్గిన పాజిటివిటీ రేటు, సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల వ్యవధిలో 91,048 నమూనాలను పరీక్షించగా కొత్తగా 3762 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,63,903కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో కరోనా బారినపడి 20 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3189కి చేరింది.
కరోనా బారినపడి ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య: తీవ్ర అస్వస్థత
తెలంగాణలో 40వేల దిగువకు కరోనా యాక్టివ్ కేసులు
గత 24 గంటల్లో 3816 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయటపడినవారి సంఖ్య 5,22,082కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 38,632 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 528 కరోనా కేసులు, మేడ్చల్-మల్కాజ్గిరిలో 213 మంది, నల్గొండలో 218 మంది, ఖమ్మంలో 214 మంది, రంగారెడ్డిలో 229 మంది కరోనా బారినపడ్డారు.
92.52 శాతానికి రికవరీ రేటు.. తగ్గిన పాజిటివీ రేటు
ఇది ఇలావుండగా, కరోనా వ్యాక్సినేషన్ రాష్ట్రంలో తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి అన్ని శాఖలు సమష్టిగా కృషి చేస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ విజయవంతంగా కొనసాగుతోందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు 4.1 శాతంగా ఉందన్నారు. ఇప్పటి వరకు 1.4 కోట్ల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో రికవరీ రేటు 92.52 శాతంగా ఉందని, మరణాల రేటు 0.56 శాతంగా ఉందని వెల్లడించారు. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 56 లక్షల మందికి టీకాలు వేసినట్లు డీహెచ్ తెలిపారు. ప్రస్తుతం 6.18 లక్షల కోవిషీల్డ్, 2.5 లక్షల కోవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జూన్ తొలివారంలో మరిన్ని డోసులు వస్తాయన్నారు.
సూపర్ స్ప్రెడర్లకు మూడురోజులపాటు వ్యాక్సిన్
ప్రజలకు దగ్గరగా ఉండేవారిని సూపర్ స్ప్రెడర్లు(ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసేవారు, రేషన్ దుకాణాల డీలర్లు, పెట్రోల్ పంపుల వర్కర్లు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లు, కూరగాయలు, పండ్లు, పూలు, నాన్వెజ్ మార్కెట్లు, కిరాణా దుకాణాల వారు, మద్యం అమ్మకాల వారికి)గా గుర్తించిన వారికి మే 28-30 వరకు మూడు రోజులపాటు వ్యాక్సినేషన్ చేయనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. క్యాబ్ డ్రైవర్లకు జీహెచ్ఎంసీ ద్వారా వ్యాక్సినేషన్ అందిస్తామన్నారు. మే నెలాఖరు వరకు 3 లక్షల మందికి కోవాగ్జిన్ డోసులు ఇవ్వాల్సి ఉందన్నారు. తెలంగాణలో జర్నలిస్టులను కూడా ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నట్లు శ్రీనివాసరావు వెల్లడించారు. మే 28 నుంచి వారికి సమాచార ప్రసారాల శాఖ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపడతామని తెలిపారు. రాష్ట్రంలో ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలకు 1200లకు పెంచుతున్నట్లు చెప్పారు.