హైదరాబాద్ కు త్రాగు నీటి గండం వార్తలపై స్పందించిన కేటీఆర్ .. ఏమన్నారంటే
హైదరాబాద్ కు తాగు నీటి గండం పొంచి ఉంది. రిజర్వాయర్లలో రోజురోజుకి నీటి నిల్వలు పడిపోతున్నాయి. నిన్నటి దాకా చెన్నై గురించి , అక్కడ నీటి సమస్య గురించి చెప్పుకున్న మనం ఇప్పుడు హైదరాబాద్ లోనే త్రాగు నీటి కోసం తీవ్ర సమస్య ను ఎదుర్కునే పరిస్థితి వచ్చింది. మరో 48 రోజులకు సరిపడే నీరు మాత్రమే అందుబాటులో ఉంది అని వచ్చిన వార్తలపై తెలంగాణా రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

హైదరాబాద్ కు 48 రోజులకు సరిపడే త్రాగు నీరు మాత్రమే ఉందన్న వార్తలపై స్పందించిన కేటీఆర్
నైరుతి రుతుపవనాలు ముఖం చాటేయడంతో వర్షాలు కురవడం లేదని, దీంతో రిజర్వాయర్లలలో నీటి కొరత నెలకొందని పరిస్థితి ఇలాగే కొనసాగితే, వర్షాలు పడకపోతే.. అగస్టు నెలాఖరుకి రిజర్వాయర్లు ఎండిపోతాయని అధికారులు చెప్పారు. ఆ తర్వాత తాగు నీరు ఎలా సప్లయ్ చేయాలో తెలియక వాటర్ బోర్డు అధికారులు ఆందోళన చెందుతున్నారని వార్తలు వచ్చాయి. వర్షాలు పడకపోతే పరిస్థితి దారుణంగా మారుతుందని అధికారులు సైతం ఆందోళన చెందారని ,సెప్టెంబర్ రెండో వారం నుంచి నీటి సంక్షోభం ఏర్పడుతుంది అని వాటర్ బోర్డు అధికారులే చెప్పారని ప్రముఖంగా పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. ఇక ఈ వార్తలపై ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు .

దర్శకుడు మారుతీ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేటీఆర్ .. భాగ్య నగర వాసులకు ఊరట
2018 జూలైతో పోలిస్తే.. 2019 జూలైలో నీటి నిల్వలు తగ్గిపోయాయని, నాగార్జునసాగర్ (కృష్ణా), శ్రీపాద ఎల్లంపల్లి(గోదావరి), ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లో నీరు లేదనే వార్తలు ప్రజలను ఆందోళనకు గురి చేశాయి. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని తేల్చేశారు కేటీఆర్ . హైదరాబాద్ లో తాగు నీటి కొరత ఏర్పడబోతుందని మీడియా ప్రచురించిన వార్తలను ప్రస్తావిస్తూ దర్శకుడు మారుతీ ఏకంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ను ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. హైదరాబాద్ కు 48 రోజులకు సరిపడా మాత్రమే తాగు నీరుందని ఆపై కష్టాలు తప్పవని వస్తున్న వార్తల్లో నిజమెంతా అని ప్రశ్నించారు.

నీటి కష్టాలపై ఆందోళన వద్దు .. త్రాగు నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటాం .. అన్న కేటీఆర్
ఇక దర్శకుడు మారుతీ ప్రశ్నకు టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బదులిచ్చారు. హైదరాబాద్ లో నీటి కొరత ఏర్పడతుందనే రిపోర్ట్ కచ్చితమైనది కాదని ఆయన బదులిచ్చారు. నగరానికి అలాంటి పరిస్థితి రాదని కేటీఆర్ స్పష్టం చేశారు. మరి కొన్ని రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోనుందని పేర్కొన్న కేటీఆర్ హైదరాబాద్ కు 172 ఎంజీడీల నీరు అందుతుందన్నారు.హైదరాబాద్ నీటి కష్టాలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నగరంలో తాగు నీటి సమస్య ఉత్పన్నం కాబోదని నగరవాసులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇదే సమయంలో నగర పౌరులంతా నీటిని పొదుపు చేసే విషయంలో ప్రాధాన్యత ఇవ్వాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వర్షపు నీటిని సంరక్షించే మార్గం ఆలోచించాలని, నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని ,నీటి సస్యరక్షణా చర్యలు కూడా ఆవశ్యకం అని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications